ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో భర్త అనుమానస్పదంగా మృతి చెందగా.. విషయం తెలియగానే భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఒంగోలుకు చెందిన నాగరాజు, శ్రీ వల్లి నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైన కారణంగా.. పెద్దలు వ్యతిరేకించారు. అయినా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఒంగోలులో కాపురం పెట్టారు. పిల్లలు లేరు. అయితే.. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో.. తనను వేధిస్తున్నాదంటూ నాగరాజుపై ఇప్పటికే... ఒంగోలు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీవల్లి కేసు పెట్టింది.
నీటికుంటలో శవంగా మారి..
మరోవైపు.. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు.. ఈ రోజు ఉదయం టంగుటూరు మండలం మర్లపాడులో నీటి కుంటలో శవమై తేలాడు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నీటి కుంట నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా, మృతుడి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఈ విషయమై... టంగుటూరు పోలీసులు ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు.
ఇంట్లో ఉరేసుకొని..
మృతుడు నాగరాజు ఇంటికి వెళ్లిన పోలీసులు... అతని భార్య శ్రీవల్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించడంపై అవాక్కయ్యారు. ఈ రెండు మరణాలు.. అనుమానాన్ని రేకిత్తిస్తున్నాయి. ఈ సంఘటనల వెనక కారణాలు ఏంటనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారం.. ఆపై బెదిరింపులు