ఆంధ్రప్రదేశ్లోని కడప రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ న్యాయవాది, కడప న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు పి. సుబ్రహ్మణ్యం.. రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంలో ఇంటి నుంచి తన కార్యాలయానికి వెళ్లిన అతను తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏం జరిగింది:
కార్యాలయానికి వెళ్లిన న్యాయవాది అక్కడే తన వాహనాన్ని పార్కింగ్ చేసి, చరవాణిని ఆఫ్ చేసి వాహనంలో పెట్టాడు. తాను గతంలో ఉంటున్న శిల్పా బహుళ అంతస్తు భవనంలోకి వెళ్లాడు. రాత్రి 8 గంటల నుంచి భార్యాపిల్లలు ఫోన్ చేస్తుండగా చరవాణి స్విచ్ ఆఫ్ వస్తోంది. రాత్రి 11 గంటల వరకు గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించగా సుబ్రమణ్యం బహుళ అంతస్తు భవనంలోకి వెళ్లే దృశ్యాలు కనిపించాయి. వెంటనే పోలీసులు భవనంలోకి వెళ్లి చూడగా... నాలుగో అంతస్తులో అతని చెప్పులు కనిపించాయి. వెంటనే వారికి అనుమానం వచ్చి చుట్టు పక్కల గాలించారు. కింద శవమై కనిపించాడు. పై నుంచి కింద పడడంతో కడుపుపై తీవ్రగాయాలయ్యాయి. చెయ్యి, కాలు విరిగిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఇది హత్యా లేక ఆత్మహత్య అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: దారుణహత్య... తల, మెుండెం వేరు చేసిన దుండగులు