పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో(Pakistan Super League betting scandal) పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ముఠాకు చెందిన అయిదుగురు బుకీలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సోమన్న.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రూ. 20 కోట్లకు పైగా..
బెట్టింగ్ కోసం ఆన్లైన్తో(cricket online betting) పాటు హవాలా మార్గం ద్వారా నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రధాన నిందితుడు సోమన్న.. రూ. 20 కోట్లకు పైగా బెట్టింగ్ నిర్వహించినట్లు భావిస్తున్నామని వివరించారు. అతను పట్టుబడితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ జరిగింది..
ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్కు.. ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్(cricket online betting) నిర్వహించింది. నిజాంపేట్లోని ఓ భవనంపై రైడ్ చేస్తే అసలు వ్యవహారం బయట పడింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోమన్న ఆధ్వర్యంలో బెట్టింగ్ నడుస్తున్నట్లు తేలింది.
విద్యార్థులే అధికం..
ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి వారినుంచి రూ.21,50,000 నగదుతో పాటు 26 మొబైల్స్, కమ్యూనికేటర్ బోర్డ్, వైఫై రూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365 వంటి ఆన్లైన్ యాప్స్ ద్వారా బెట్టింగ్(online betting apps) చేస్తున్నట్లు వారు తెలిపారు. యువకులు, విద్యార్థులే అధికంగా ఈ బెట్టింగ్లో పాల్గొన్నట్లు వివరించారు. తల్లిదండ్రులు.. పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: Kidnap: నా భార్యను కిడ్నాప్ చేశారు.. న్యాయం చేయండి..