నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన హోంగార్డును చితకబాదిన నిందితులు కేసుకు సంబంధించిన నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఓ హోంగార్డును నిందితులు చితకబాదారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారుతీ ప్రసాద్ అనే వ్యక్తి తన ఇల్లు గృహాలంకరణ కోసం దేవీలాల్కు డబ్బులిచ్చాడు. అప్పటి నుంచి దేవీలాల్ తప్పించుకు తిరుగుతుండటంతో... మారుతీప్రసాద్ కూకట్పల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు బాచుపల్లి పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దేవీలాల్ ఆచూకీ లభించకపోవడంతో కేసులో ఎలాంటి పురోగతి లేదు. దేవీలాల్ పఠాన్చెరులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న మారుతీప్రసాద్.. విషయాన్ని బాచుపల్లి పోలీసులకు సమాచారమందించాడు. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను ఇవ్వడానికి హోంగార్డు కనకయ్య అక్కడికి వెళ్లాడు.
పఠాన్చెరు పరిధిలోని నోవాఫాన్ కూడలి సమీపంలో ఓ ఇంట్లో దేవీలాల్ పనిచేస్తున్నట్లు తెలుసుకొని హోంగార్డు అక్కడికి వెళ్లాడు. నోటీసులు ఇచ్చి సంతకం పెట్టాల్సిందిగా కనకయ్య కోరగా దేవీలాల్ నిరాకరించాడు. దీంతో కనకయ్య, దేవీలాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దేవీలాల్, అతని అనుచరులు కలిసి కనకయ్యపై దాడికి దిగారు. చెప్పు, కర్రతో కనకయ్యను చితకబాదారు. ఈ దృశ్యాలను హోంగార్డు వెంట వెళ్లిన ఫిర్యాదుదారు మారుతీప్రసాద్ తన ఫోన్లో చిత్రీకరించాడు. కనకయ్య ఫిర్యాదుతో దేవీలాల్తో పాటు అతని ముగ్గురు అనుచరులను పటాన్ చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: Attack: పోలీసునని చెప్తున్నా వినకుండా కానిస్టేబుల్పై దాడి