వంద రూపాయల నోటు ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చు (Murder for hundred rupees) రాజేసింది. ఒకే ప్రాంతానికి చెంది.. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య వంద రూపాయల నోటు అగ్గి రాజేసింది. అప్పటి వరకూ కలిసి మెలిసి ఉన్న వారిద్దరి మధ్య వంద రూపాయల వివాదమే చినికిచినికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు చేరింది. అంతేకాదు.. కేవలం వంద రూపాయల (Murder for hundred rupees) వివాదంలో ఓ వ్యక్తి మరోవ్యక్తిపై ఏకంగా కత్తితో దాడిచేసి అంతమొందించిన ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం రేపింది.
మద్యం మత్తులో...

మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘడ్ జిల్లా పీపటోలాకు చెందిన 20 మంది కూలీలు రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజారకు వ్యవసాయ పనుల కోసం వచ్చారు. వారిలో తొమ్మిది మంది తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోగా 11 మంది ఇక్కడే ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. రైతు వద్ద పనిచేయగా వచ్చిన కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలీలు దయాళ్, మడివి సేత్రాం మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలోనే క్షణికావేశానికి గురైన మడివి... కూరగాయలు తరిగే చాకుతో దయాళ్పై దాడి చేశాడు. ఛాతీపై బలంగా పొడవటంతో దయాళ్ (Murder for hundred rupees) అక్కడికక్కడే మృతిచెందాడు.
వంద రూపాయల కారణంగానే...
మడివి, దయాళ్ మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఇతర కూలీలు, స్థానికులు ఈ ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈనెల 11న రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారించారు. ఈ విచారణలో కూలీ డబ్బుల విషయంలో వంద రూపాయల విషయంలో తలెత్తిన వివాదం వల్లనే దయాళ్పై దాడి చేసి చంపినట్లు (Murder for hundred rupees) మడివి సేత్రాం.. అంగీకరించగా.. పోలీసులు నివ్వెరపోయారు.

తీరని వేదన...
మృతుడు, హంతకుడు ఇద్దరికి వివాహమైంది. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. 35 ఏళ్ల దయాళ్ మృతదేహాన్ని స్వగ్రామనికి తరలించారు. క్షణికావేశంలో చేసిన తప్పుతో 40 ఏళ్ల సేత్రాం కటకటాలపాలయ్యాడు. ఇలా కేవలం వంద రూపాయల వివాదం రెండు కుటుంబాల్లో తీరని వేదన నింపింది.
మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది కూలీలు ఖమ్మం జిల్లా ఎన్వీ బంజారాకు కూలీ పనుల కోసం వచ్చారు. రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నారు. నాలుగైదు నెలలు పనులు చేసుకుని తిరిగి మధ్యప్రదేశ్కు వెళ్లిపోతారు. ఈనెల 11న రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి కూలీ పని చేసి 100 రూపాయలు తీసుకుని రాగా... అందులో నాకు భాగముందని మరో వ్యక్తి వాదించాడు. ఈ క్రమంలో ఇరువురికి ఘర్షణ జరిగింది. కోపోద్రేకంలో కత్తితో పొడవడం వల్ల ఈ ఘటన జరిగింది.
-- సత్యనారాయణ రెడ్డి, ఖమ్మం గ్రామీణ సీఐ
ఇదీ చదవండి: Sexual assault: ఆరేళ్ల చిన్నారిపై... యువకుడు అత్యాచారయత్నం