జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామంలో బండిపల్లి రాజమ్మ అనే నిరుపేద వృద్ధురాలికి పాలకుర్తి ఎస్ఐ గండ్రాతి సతీశ్ తన స్వంత ఖర్చులతో 2లక్షల వ్యయంతో నూతనంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా దయాకర్రావు చేతుల మీదుగా ఇంటికి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్వీట్లు పంచి రాజమ్మకు తినిపించారు.
ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఉషా దయాకర్రావు రాజమ్మకు ఆర్థిక సహాయంతోపాటు బియ్యం, నిత్యావసరాలను అందించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందు నిలవాలన్నారు.
బండిపల్లి రాజమ్మ తన వికలాంగుడైన కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో ఉంటుంది. అది ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. కోడలు సంవత్సరం క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇంటికి తలుపులు లేకపోవడంతో.. పాముకాటుతో ఆరేళ్ల మనుమరాలు చనిపోయింది. ఓ వైపు ఇద్దరినీ కోల్పోయిన దుఃఖం, మరోవైపు వికలాంగుడైన కొడుకు.. చలించిన ఎస్ఐ సతీశ్ ఎలాగైనా వృద్ధురాలికి ఇళ్లు కట్టించాలి అనుకున్నారు. రూ.2లక్షల వ్యయంతో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఎస్ఐకి రాజమ్మ ధన్యవాదాలు తెలిపింది.
ఇదీ చూడండి: కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!