CJI at Bhadrakali Temple : వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ దంపతులు దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం బహుకరించిన బంగారు కిరీటంతో పాటు జటమకుటాలను అర్చకులు అమ్మవారికి అలంకరించారు. దర్శనం అనంతరం సీజేఐకు ప్రధాన అర్చకులు శేషు.. ఆలయ విశిష్టతను తెలియజేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
CJI at Bhadrakali Temple Warangal : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక నేపథ్యంలో పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి అనుమతి లేదంటూ భక్తులను.. ప్రధాన గేటు వద్దే నిలిపేశారు. కొందరు అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
వెయ్యి స్తంభాల గుడిలో పూజలు..

హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పండితులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుద్రేశ్వరునికి జస్టిస్ ఎన్వీ.రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి.. పట్టు వస్త్రాలు కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం ముందున్న నంది విగ్రహం, కాకతీయ రాతి కట్టడాలను జస్టిస్ ఎన్వీ.రమణ ఆసక్తిగా పరిశీలించారు. అర్చకులు ఆలయ విశిష్టత తెలియజేశారు.
నేడు హనుమకొండకు..
CJI Warangal Tour : వరంగల్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నిన్న రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. రెండోరోజు పర్యటనలో భాగంగా.. హనుమకొండలో కొత్తగా నిర్మించిన పది కోర్టుల భవన సముదాయాన్ని సీజేఐ ప్రారంభిస్తారు. నిర్మాణ పరంగానే కాకుండా.. కక్షిదారుల సౌకర్యార్ధం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా ఈ కోర్టు భవనాలను నిర్మించారు. నూతన భవనంతోపాటు.. సీనియర్ సివిల్ న్యాయస్ధాన హాలును పోక్సో కోర్టుగా మార్చారు. లైంగిక దాడుల కేసుల్లో విచారణకు హాజరయ్యే బాధితులు, వారి కుటుంబసభ్యులు ఎవరికీ కనిపించకుండా.. ప్రత్యేక ద్వారాన్ని, విచారణ కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నం హైదరాబాద్కు వెళ్తారు.
ఇదీ చూడండి : CJI NV Ramana tour: వరంగల్లో నేడు కోర్టు భవనాలు ప్రారంభించనున్న సీజేఐ