కొవిడ్ రహిత గ్రామాలు, పట్టణాలే లక్ష్యంగా మహబూబ్నగర్ జిల్లా యంత్రాగం కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మండలాల్లో గ్రామాలు యూనిట్గా, మున్సిపాలిటీల్లో వార్డులు యూనిట్గా తీసుకుని... కరోనా రహిత ప్రాంతాలుగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఏప్రిల్ 15 నుంచి కేసులు మొదలై... ఇప్పటివరకు 42 నమోదయ్యాయి. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ కోవిడ్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. గ్రామంలోని ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు రెండుసార్లు జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించి మందులిచ్చారు. ఇంటికే పరిమితం చేసి కోలుకునే వరకు పర్యవేక్షించారు. గ్రామాన్ని క్రమం తప్పకుండా శానిటైజ్ చేశారు. కేసులు అధికంగా ఉన్నచోట మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆసుపత్రులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో 12 క్రీయాశీల కేసులు ఉన్నాయి. వారం పది రోజుల్లో వారంతా హోం క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నారు.
ముందే ఐసోలేషన్లోకి..
లక్షణాలు గుర్తించి ముందే ఐసోలేషన్లో ఉండటం, సరైన సమయానికి మందులు వాడటం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కోలుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పక్కాగా లాక్డౌన్ అమలు చేయడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. కొవిడ్ లేని గ్రామంగా వెంకటాపూర్ తయారుకావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
వారానికోసారి గ్రామాల పరిస్థితిపై సమీక్ష..
వెంకటాపూర్లాగే ప్రతి గ్రామంలోనూ కరోనా కట్టడి కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేకంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కరోనా కేసులు, కట్టడిచర్యలు, శానిటైజేషన్ సహా ఇతర చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్నవారు, కోలుకున్న వారు, లక్షణాలున్న వారి బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారానికోసారి గ్రామాల పరిస్థితిని జిల్లా స్థాయిలో సమీక్షించనున్నారు. తద్వారా కోవిడ్ లేని గ్రామాలు తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
కేవలం కోవిడ్ మాత్రమే కాకుండా రానున్న వర్షాకాలంలో ఎలాంటి జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ఈ ప్రత్యేక డ్రైవ్లో చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ రహిత గ్రామాల లక్ష్యసాధనను జిల్లా కలెక్టర్ వెంకట్రావు, కొవిడ్ రహిత వార్డులను అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: ktr: 'వ్యాక్సిన్ హబ్గా ఉన్నా.. గ్లోబల్ టెండర్లు పిలవాల్సి వచ్చింది'