కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామపంచాయతీకి ఓ ట్రాక్టర్ ఉండాలి. అందుకనుగుణంగా మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి... డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఈ ట్రాక్టర్లను వినియోగించనున్నారు. హరితహారంలో భాగంగా నాటిక మొక్కలకు నీరు పోసేందుకు వాటర్ ట్యాంకర్, పిచ్చిమొక్కలను తొలగించడం, రహదారులను సరిచేయడం కోసం డోజర్ను వినియోగించనున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని 440 గ్రామపంచాయతీలకు గానూ... 438 ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి కలెక్టర్ అనుమతించారు. ఇందుకు ప్రతి ట్రాక్టర్కు సుమారు 8 లక్షల 95వేలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్, డోజర్ ఉంటాయి. ఇందుకయ్యే వ్యయానికి పంచాయతీల నుంచి ఆమోదం తీసుకున్నారు. పంచాయతీ నిధులతో... ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో అద్దె ట్రాక్టర్లను వినియోగించారు. ప్రస్తుతం కూలీలను పెట్టి మొక్కలకు నీరు పోయిస్తున్నారు.
ఆల్ ఇన్ వన్ ట్రాక్టర్
ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తే గ్రామాల ముఖచిత్రం మారనుంది. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. అదే ట్రాక్టర్కు ట్యాంకర్ అమర్చి, మొక్కలకు నీరు పోయనున్నారు. గతంలో రోడ్ల మరమ్మతులకు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేంది. కానీ ఇక నుంచి ట్రాక్టర్కే డోజర్ అమర్చి... ఎవరి అనుమతి లేకుండానే రోడ్లు బాగు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
పైసలు పంచాయతీవే...
గ్రామాలను పూర్తి స్వచ్ఛతగా మార్చుకోడానికి కొన్ని పంచాయతీలు ముందుకొచ్చాయి. ఆర్థిక స్థితిగతులు బాగున్న 42 పంచాయతీలు వంద శాతం నిధులు సమకూర్చుకొని ట్రాక్టర్ కొనుగోలు చేశాయి. ఆర్థిక వనరులు అంతంతమాత్రం ఉన్న పంచాయతీలు బ్యాంకు రుణాల సాయంతో సమకూర్చుకొంటున్నాయి. ట్రాక్టర్ల నిర్వహణకు అవసరమయ్యే నిధులు గ్రామపంచాయతీల ఆదాయం నుంచే వెచ్చించాల్సి ఉంటుంది.
మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ట్రాక్టర్లను ఇచ్చేందుకు అమ్మకం దారులు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు అన్ని పంచాయతీలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: ఆన్లైన్లో హాస్టల్ బుకింగ్... అందులోనూ డిస్కౌంట్...