బకాయిలు తగ్గించి విద్యుత్ సంస్థలను పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రీపెయిడ్ మీటర్లపై దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా కరీంనగర్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్ చేసినా... నిర్వహణ, వాడకం తదితర సమస్యలతో పాతపద్ధతిలో బిల్లులు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 884 ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేశారు. కరెంటు సరఫరా లోడ్ దాటితే ఆ మీటర్ల నుంచి సరఫరా నిలిచిపోతుంది. కలెక్టరేట్లో అర్ధాంతరంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో లోడ్ పెంచాలని అధికారులు సూచించారు. లోడ్ పెంచాలంటే అందుకు అనుగుణంగా... అదనపు ఛార్జీలను ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా అదనపు ఛార్జీలు చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలు లేవు కాబట్టి స్మార్ట్మీటర్లను కాస్తా సాధారణ మీటర్లతో సమానంగా కనెక్షన్ ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
అధిక ఛార్జీలు
ప్రీపెయిడ్ మీటర్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మీటర్ల వినియోగంపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. వాటికితోడు ఇంటిలో విద్యుత్ సరఫరాలో.... చిన్న లోపం ఉన్నా అవి కాలిపోతున్నాయి. సాధారణ మీటర్కు 1200 చెల్లించాల్సి వస్తే... ప్రీపెయిడ్ మీటర్లకు సుమారు 4 వేలు, కుటీర పరిశ్రమలు వాడే సీటీమీటర్ కాలిపోతే 15వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రీపెయిడ్ మీటర్ల వినియోగంపై ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేస్తామని అధికారులు అంటున్నారు. ఇబ్బందులు పరిష్కరిస్తే ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: KTR: 'హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచినా... ఓడినా ఏం మారదు'