లాక్డౌన్ నేపథ్యంలో హోటళ్లు సరిగా నడవక.. వేడుకలు, వివాహాలు, సభలు వంటివి జరగక నిమ్మకాయల అమ్మకాలు సగానికి తగ్గాయి. గత మార్చిలో నిమ్మకాయల క్వింటా గరిష్ఠ ధర రూ.10 వేలుండగా హైదరాబాద్ బోయిన్పల్లి టోకు మార్కెట్లో శుక్రవారం రూ.వెయ్యి పలికింది. ఈ నేపథ్యంలో కూలీ, రవాణా ఖర్చులైనా రావడం లేదంటూ రైతులు నిమ్మకాయలను చెట్ల పైనే వదిలేస్తున్నారు. అవి అలా పండి కళ్లముందే నేలరాలుతుంటే నష్టాలపాలై ఆవేదన చెందుతున్నారు. మరోపక్క వినియోగదారులకు నిమ్మకాయలు తక్కువ ధరకు లభిస్తున్నాయా? అంటే అదీ లేదు. చిల్లర మార్కెట్లో వ్యాపారులు ఒక్కో నిమ్మకాయను రూ.2కు అమ్ముతున్నారు. ఈ రకంగా రైతులకు ధర దక్కడంలేదు. వినియోగదారులకు ఉపశమనం లభించడంలేదు.
సిండికేట్గా మారి...
నిమ్మకు మద్దతు ధర లేకపోవడంతో చిల్లర మార్కెట్లో డిమాండును బట్టి వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి. అందువల్లనే ధరలు ఇంతలా దిగజారుతున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల వ్యాపారుల ప్రతినిధులు నేరుగా వేలంలో పాల్గొని ధరలు పెంచేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. స్థానిక వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సిండికేట్గా మారి తక్కువ ధరకు వేలంపాట పాడి.. మళ్లీ వెంటనే 50 నుంచి 100 శాతం అదనంగా ధర పెంచి ఇతర రాష్ట్రాల టోకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.
ఆర్డర్లు రావడంలేదు
రాష్ట్రంలో 22వేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్లో నిమ్మకాయలకు ప్రత్యేకంగా వ్యవసాయ మార్కెట్ ఉంది. అక్కడి నుంచి ఏటా భారీగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పుడక్కడ కొనుగోలు ఆర్డర్లు రావడం లేదని ఇక్కడి మార్కెట్ అధికారి వివరించారు.
కూలి ఖర్చులు దండగని కోత ఆపేశాను..
నాలుగెకరాల్లో నిమ్మసాగుకు సుమారు రూ.3లక్షల పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు క్వింటా ధర రూ.800 నుంచి రూ.1000కి పడిపోవడంతో రూ.లక్ష వరకూ నష్టం వస్తోంది. 25 కిలోల నిమ్మకాయలను చెట్ల నుంచి కోయడానికి కూలీలు రూ.100 అడుగుతున్నారు. వచ్చింది కాస్తా కూలి, రవాణా ఖర్చులకే సరిపోతుందని నిమ్మకాయలు కోయడం మానేశాను.- - వై.శ్రీనివాసరెడ్డి, నిమ్మ రైతు, నెల్లిబండ, నకిరేకల్ మండలం, నల్గొండ జిల్లా