నెల్లూరులోని సిద్దేంద్రయోగి కళాక్షేత్రంలో కూచిపూడి శిక్షణ ఇస్తారు. అక్కడ చాలా మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. అద్భుత భంగిమలతో ఆకట్టుకుంటున్న ఈ యువతులు... రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ ప్రతిభను చాటుకుంటున్నారు. ఒక్కొక్కరు వందకు పైగా ప్రదర్శనలు చేసి ప్రశంసలు అందుకున్నారు.
పాశ్చాత్య నృత్యంపై మనసు..
ప్రస్తుతం... చాలామంది పాశ్చాత్య నృత్యంపై మనసు పారేసుకుంటున్నారు. సంప్రదాయ నాట్యంపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో.. యువతలో అవగాహన పెంచడానికి బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు వీరంతా. సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే కళామ్మ తల్లిని బతికించుకుందామని ఊరురా తిరుగుతున్నారు.
ఆన్లైన్ తరగతుల వినియోగం పెరిగి...
కూచిపూడి వల్ల ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవచ్చు. అక్కడక్కడ.... ఈ కళపై ఆసక్తి కనబరుస్తున్న ఔత్సాహికులు ఉన్నప్పటికీ... నేర్పించే వారు కనిపించట్లేదు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల వినియోగం పెరగడంతో... తెలుగురాష్ట్రాలలో ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా కుచిపూడిలో శిక్షణ పొందవచ్చు అంటున్నారు...ఈ నాట్య మయూరాలు.
ప్రకటనలకే పరిమితం
సంప్రదాయ కళల్ని కాపాడుతామనే ప్రభుత్వ ప్రకటనలు.. ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక నృత్య కళాశాలలు ఉన్నాయి. కానీ, వాటిని సమర్థంగా నిర్వహించట్లేదు. డిప్లొమాతో పాటు నృత్యంలో కోర్సులు చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. కాబట్టి... ఈ రంగంలో రాణిస్తున్న వారికి ప్రభుత్వం... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇటువైపు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని విధాలుగా సహాయ సహకారాలు
నెల్లూరుకు చెందిన నాట్యకారుడు డేగల సాంబశివరావు ఈ యువ బృందానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమలాంటి శిక్షకులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తే.... ఎంతో మంది కళాకారులను తయారు చేస్తామంటున్నారు.
దేశవ్యాప్తంగా..
రానున్న రోజుల్లో... కూచిపూడి అవగాహన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు ఈ యువ బృందం. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్న కూచిపూడిని... తదుపరి తరాలకు అంతే ప్రభావవంతంగా అందించడమే వారి లక్ష్యం.
ఇవీ చూడండి: కశ్మీరి చిల్లీ మటన్.. చూస్తేనే నోరూరెన్..!