పురపాలక ఎన్నికల కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ కొనసాగుతోంది. అది పూర్తయితే కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏ పదవి ఎవరికి కేటాయిస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ కోసం గతంలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు రెండు దఫాలుగా సేకరించారు. రిజర్వేషన్ల ఖరారు కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది.
రెండు యూనిట్లుగా విభజన...
కొత్త చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇవి కాకుండా 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీలు ఉన్నాయి. 13 కార్పొరేషన్లు ఒక యూనిట్గా మేయర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 13 కార్పొరేషన్లలోని మేయర్ పదవులను ఎస్సీ, ఎస్టీల శాతానికి అనుగుణంగా కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు కనీస ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. యాభై శాతంలో మిగతా శాతం సీట్లను బీసీలకు రిజర్వ్ చేస్తారు.
పదవీకాలం పూర్తికాకపోయినా..
అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లను లాటరీ ద్వారా మహిళలకు కేటాయిస్తారు. అయితే జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. ఆ మూడు చోట్ల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మరో 8 మున్సిపాల్టీల్లోనూ ప్రస్తుతం ఎన్నికలు జరగకకపోయినా అన్ని కార్పొరేషన్లు ఒక యూనిట్గా మేయర్ పదవులు ఖరారు చేయాల్సి ఉంది. ఇందువల్ల హైదరాబాద్ సహా అన్ని కార్పొరేషన్ల మేయర్ పదవుల రిజర్వేషన్లు త్వరలోనే తేలనున్నాయి. మున్సిపాల్టీల పరిస్థితి కూడా ఇదే. 128 మున్సిపాల్టీలు ఒక యూనిట్గా ఛైర్ పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు లేని పట్టణ, నగరపాలకసంస్థల మేయర్, ఛైర్ పర్సన్ల పదవుల రిజర్వేషన్లు కూడా త్వరలోనే తేలనున్నాయి.
ఓటర్లతో పాటే వారివి...
వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాతో పాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేయాలని పురపాలకశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ జూన్ 4కు పూర్తి కానుంది. మేయర్, ఛైర్పర్సన్ల పదవుల పూర్తి స్థాయి రిజర్వేషన్లు 5న, వార్డుల వారీ తుది రిజర్వేషన్లు 6న ఖరారు చేస్తారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!