హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రీలాంచింగ్ ఆఫర్లతో కొందరు కొనుగోలుదారులు దగాపడుతుండగా.. మరికొందరు బిల్డర్లు, డెవలపర్ల చేతిలోనూ మోసపోతున్నారు. స్థిరాస్తి రంగంలో నమ్మకంపైనే ఎక్కువగా లావాదేవీలు జరుగుతాయి. చాలా కేసులు రెరా పరిధిలో లేకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు చట్టపరంగా పోరాటం చేస్తుండగా.. మరికొందరు సెటిల్మెంట్ల కోసం నేతలను ఆశ్రయిస్తున్నారు. కొందరు బిల్డర్లు నిర్మాణాలను మధ్యలోనే ఆపేస్తున్నారు. అల్వాల్లో ఒక బిల్డర్ 2019 డిసెంబరు నాటికి అపార్ట్మెంట్ పూర్తిచేసి ఇస్తానని హామీ ఇచ్చాడు. పలువురు రుణం తీసుకుని కొనుగోలు చేశారు. 2021 వచ్చినా పనులు పూర్తి కాలేదు. కొనుగోలుదారులు రెండేళ్లుగా ఈఎంఐ, ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. బిల్డర్ని నిలదీసిన ప్రతిసారీ మూడు నెలల్లో పూర్తి చేస్తానని చెపుతూ వస్తున్నాడు. బీరంగూడలో గతంలో ఒక బిల్డర్ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేయడంతో కొనుగోలుదారులే తలా రూ.3-4 లక్షల చొప్పున ఖర్చుచేసి.. మిగతా పనులు పూర్తి చేసుకున్నారు. కొల్లూరు జంక్షన్ చేరువలో చేపట్టిన వ్యక్తిగత ఇళ్ల కోసం చాలామంది పూర్తి సొమ్ము చెల్లించినా.. నిర్మాణాలు మాత్రం పూర్తి చేయడం లేదని ఫిర్యాదులున్నాయి. కొందరు డెవలపర్లు ఒకచోట వచ్చిన సొమ్ముతో వేరేచోట్ల భూములు కొని.. గడువులోపు పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారు.
భూయజమాని, బిల్డర్ మధ్య నలిగిపోతున్నారు
హైదరాబాద్లో నిర్మాణాలు చేపడుతున్న స్థలాలన్నీ చాలావరకు అభివృద్ధి పేరుతో భూయజమాని నుంచి తీసుకున్నవే. భూయజమానితో బిల్డర్ డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకుని గృహ, వాణిజ్య నిర్మాణాలు చేపడుతుంటారు. 40-50, 50-50 నిష్పత్తిలో వాటాలు పంచుకుంటారు. ఒకవేళ వీరి మధ్య విభేదాలు తలెత్తినా నలిగిపోయేది కొనుగోలుదారులే.
- తుర్కయాంజల్ పరిధిలో 2018లో ఒక బిల్డర్ భూయజమాని నుంచి జీపీఏ చేసుకుని బహుళ అంతస్తుల నిర్మాణం మొదలెట్టారు. ఇందులో 12 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి 25 లక్షల వరకు చెల్లించారు. స్లాబ్ల వరకు పనులు పూర్తయ్యాయి. బిల్డర్, భూయజమాని మధ్య విభేదాలతో పనులు నిలచిపోయాయి. ఇదే బిల్డర్ మరో అపార్ట్మెంట్ నిర్మించగా.. అందులో 9 మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. మిగతా ముగ్గురికి చేయలేదు. వీరిలో ఇద్దరు పూర్తి సొమ్ము చెల్లించగా.. మరొకరు సగం చెల్లించారు.
- బంజారాహిల్స్ కేంద్రంగా నడుస్తున్న ఒక రియల్ ఎస్టేట్ సంస్థ షాద్నగర్లో ఇంటి స్థలాల వెంచర్ వేయడంతో అందులో పలువురు సొమ్ము చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ స్థలంలో న్యాయపరమైన సమస్యలున్నాయంటూ మరో స్థలం చూపించారు. అందుకూ కొనుగోలుదారులు అంగీకరించారు. తీరా రిజిస్ట్రేషన్ సమయానికి భూయజమాని ముందుకు రాలేదు. దీంతో ఇంకోచోట స్థలం ఇస్తామన్నారు. దాన్ని వద్దనుకున్న కొనుగోలుదారులు తమ డబ్బు చెల్లించాలని కోరితే డెవలపర్ ససేమిరా అన్నారు.
పార్కింగ్, క్లబ్హౌస్లకూ కిరికిరి
పలు గేటెడ్ కమ్యూనిటీల్లో క్లబ్హౌజ్, వాణిజ్య నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. కొందరు వాణిజ్య నిర్మాణాలనూ విక్రయిస్తుండగా.. మరికొందరు ఫ్లాట్ ఓనర్ల సంక్షేమ సొసైటీకి అప్పగిస్తున్నారు. ఇంకొందరు మాత్రం కిరికిరి పెడుతున్నారు. మొదట్లో సొసైటీకి చెందుతుందని చెప్పి.. ఆపై విక్రయిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఎల్బీ నగర్లో నిర్మించిన భారీగేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్ ఇలాగే చేస్తే ఫ్లాట్ ఓనర్స్ సంక్షేమ సొసైటీ కోర్టుకెళ్లింది.
- ప్రతి ఫ్లాట్ యాజమానికి బిల్డర్ పార్కింగ్ నిమిత్తం 100 చదరపు అడుగులు లేదా కారు పట్టేంత స్థలం చూపించాలి. పార్కింగ్ ప్రదేశాలను లాటరీ లేదా మరో పద్ధతిలో పారదర్శకంగా కేటాయించాలి. లాటరీ వేయాల్సి వస్తే అన్ని స్థలాలను కలిపి వేయాలి. కానీ కొందరు బిల్డర్లు తనకు, భూయాజమానికి అనువైన స్థలాలను ఉంచుకుని మిగిలిన వాటిని కేటాయిస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఓ బిల్డర్ ఇలాగే చేశారు. సందర్శకులకు(విజిటర్లకు) 3% పార్కింగ్ స్థలం చూపాల్సి ఉన్నా దీన్ని కొందరు పాటించడం లేదు.
ప్రణాళికలూ మార్చేశారు
కొంపల్లిలో ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలు బిల్డర్తో కలిసి వాణిజ్య సముదాయ భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. సొసైటీ పేరుతో రిజిస్టర్ చేశారు. అదే సామాజికవర్గానికి చెందిన వ్యాపారస్తులను కలిసి ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేశారు. చాలామంది 75 శాతం సొమ్ము మొదటే చెల్లించారు. ఆ సొమ్ముతో భూమి కొన్నారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్+ ఐదు అంతస్తుల నిర్మాణానికి ప్లాన్ గీయించారు. రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. పైగా సొసైటీని ప్రైవేటు లిమిటెడ్గా మార్చారని కొనుగోలుదారులు ఆక్షేపిస్తున్నారు. భవనాన్ని ఎనిమిది అంతస్తులకు పెంచారు. మూడు అదనపు అంతస్తులతో కొనుగోలుదారులకు సంబంధం లేదని, తాము అమ్ముకుంటామని సదరు సంస్థ అంటోంది. గ్రౌండ్ ఫ్లోర్కు డిమాండ్ పెరగడంతో ఇతరులకు అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారికి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్గా మార్చారు. సొమ్మును వెనక్కి ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: సైబర్ బీమా గురించి ఇవి తెలుసా?