తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ అమర్చేందుకు మీటర్ల ఖర్చుతో పాటు కొంత అడ్వాన్స్ కలిపి రూ.8,687 నెల రోజుల్లో చెల్లించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందుకు తగినన్ని నిధులను విద్యాశాఖ మంజూరు చేయకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలుండటంతో ఇప్పటికే వందలాది బడులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని.. ఇప్పుడు స్మార్ట్ మీటర్లుకు నిధులు ఎక్కడ నుంచి తీసుకురావాలని వారు తలలుపట్టుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2016లో నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ఇచ్చింది రూ.6 వేలే..
ఇటీవల పాఠశాల విద్యాశాఖ స్కూల్ గ్రాంట్ను విడుదల చేసింది. రూ.6 వేల చొప్పున అందిన బడులు దాదాపు 15 వేలు ఉండటం గమనార్హం. ఇప్పుడు స్మార్ట్ మీటర్కు రూ.8,687 చెల్లించాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
15 వేల బడులకు బకాయిల భారం
రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 15 వేల బడులకు విద్యుత్తు బకాయిలున్నాయి. మొత్తం బకాయిలు రూ.100 కోట్ల వరకు ఉన్నాయి. ఒక్క సిద్దిపేట జిల్లాలో రూ.1.07 కోట్ల బకాయిలున్నాయి. దాంతో డిస్కం సిబ్బంది అలాంటి వాటికి విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తున్నారు. పాఠశాలలకు సంబంధించి ఏ బిల్లులైనా విద్యాశాఖే చెల్లించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, పూర్వ అధ్యక్షుడు భుజంగరావు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనకు వినతిపత్రం అందజేశారు.
అదనంగా నిధులివ్వాలి
విద్యుత్తు, నీటి బిల్లులు కోసం పాఠశాలలకు విద్యా శాఖ అదనంగా నిధులివ్వాలి. స్కూల్ గ్రాంట్ను ఈ బిల్లుల కోసం చెల్లించాల్సి వస్తుండటంతో ఇతర విద్యాపరమైన ఖర్చులకు నిధులు సరిపోవడం లేదు. ఇప్పటికే వేలాది బడులు విద్యుత్తు బిల్లులు చెల్లించలేక బకాయిలు పడ్డాయి.
- రాజాభాను చంద్రప్రకాశ్, అధ్యక్షుడు, రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం
- ఇదీ చూడండి : కరోనాకు తోడైన కల్తీ.. ప్రమాదకరంగా ఆహారం