Drones Usage in Agriculture : డ్రోన్లతో రసాయన మందులను పంటలపై పిచికారీ సమయంలో రైతులు, రైతుకూలీలు తప్పనిసరిగా ‘పీపీఈ’ కిట్ను ధరించాలని కేంద్ర వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పంటలపై రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా రసాయన మందులను చల్లుతున్నారు. 5 నుంచి 10 అడుగుల ఎత్తులో డ్రోన్లతో పురుగుమందులను చల్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రైతులు, వ్యవసాయ కూలీల ప్రాణాలకు ప్రమాదమని ప్రయోగాల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ(ఎస్వోపీ)కి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా రాష్ట్ర వ్యవసాయశాఖకు, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు పంపింది.
- చెరువులు, నదులు వంటి సహజ నీటివనరులకు వంద మీటర్ల దూరంలోపు భూముల్లోని పంటలపై డ్రోన్లతో రసాయనాలను చల్లకూడదు.
- డ్రోన్ వినియోగించే సమయానికి 8 గంటల ముందు నుంచి దాన్ని నడిపే ఆపరేటర్లు, ఆ ప్రాంత పొలాల్లోని రైతులు, కూలీలు మద్యం తాగకూడదు.
- ‘‘సాధారణంగా కూలీలతో పిచికారీ చేయించేందుకు వాడే నీటిలో 20-30 శాతం డ్రోన్లకు సరిపోతుంది. ఎకరా పంటపై అరగంటలోనే మందు చల్లడం పూర్తవుతుంది. రసాయనాల అధిక మోతాదు, అదనపు వినియోగం ఉండదు. వీటి వినియోగంతో రైతులకు ఆర్థికంగా లాభం, పంటలకు మేలు’’ అని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు.