పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో ఎ.వి.రమణదీక్షితులు ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడింది. ఆయనతో పాటు మరో 14 మంది తిరిగి అర్చకులుగా వచ్చేందుకూ మార్గం సుగమమైంది. 65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి తీర్మానించింది.
దీనికి అనుగుణంగా అప్పటి తితిదే ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులుతోపాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ 2018 డిసెంబరులో హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం పెండింగ్లో ఉంది.
విధుల్లో చేరనున్న 14 మంది అర్చకులు!
అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని హైదరాబాద్లోని లోటస్పాండ్లోని ఆయన ఇంటికి వెళ్లి రమణదీక్షితులు కలిశారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును తిరిగి నియమిస్తామని జగన్ నాడు హామీ ఇచ్చారు. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో ఎంఎస్ నంబరు 439 ద్వారా అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. రమణదీక్షితులును ప్రధాన అర్చకులుగా నియమిస్తారని భావించినా... తితిదే ఆగమ సలహామండలి గౌరవ అధ్యక్షుడిగా నియమించారు.
నాడు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తితిదే అదనపు ఈవో శుక్రవారం ఆదేశాలిచ్చారు. పదవీ విరమణ చేసే సమయానికి వారు ఏ స్థానంలో ఉన్నారో అక్కడే నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో రమణదీక్షితులుతోపాటు 14 మంది అర్చకులు తిరిగి విధుల్లో చేరనున్నారు. రమణదీక్షితులుతోపాటు మరో ముగ్గురు పదవీ విరమణ పొందిన తర్వాత వారి స్థానంలో నలుగురు కొత్తవారిని నియమించారు. ప్రస్తుతం వేణుగోపాల దీక్షితులుతోపాటు మరో ముగ్గురు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ చేసినవారు తిరిగి అదే స్థానంలో చేరితే కొత్తగా బాధ్యతలు తీసుకున్నవారు తమ పాత స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై నిర్ణయం వాయిదా..
తిరుమలేశుని ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడాన్ని వాయిదా వేసినట్లు తితిదే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలుత ఈనెల 14 నుంచి భక్తులను అనుమతించాలని తితిదే భావించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా నిర్ణయం తీసుకుంది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే విషయాన్ని తెలియజేస్తామంది.
ఇవీచూడండి: గంజాయి మత్తులో యువత భవిత చిత్తు!