కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన మహిళను.. ఓ రైల్వే కానిస్టేబుల్ ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఉదయం నాలుగున్నర గంటల సమయంలో.. ఏపీలోని తిరుపతి స్టేషన్ చేరుకున్న తిరుమల ఎక్స్ప్రెస్ నుంచి ఓ కుటుంబం ఆ స్టేషన్లో దిగాలి. అయితే నిద్రమత్తులో ఉండటంతో వారు గమ్యస్థానాన్ని గమనించలేదు. రైలు స్టేషన్ నుంచి బయలుదేరే క్రమంలో నిద్రమత్తు నుంచి లేచిన కుటుంబం.....హుటాహుటిన రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ముందు ఓ యువతి రైలు నుంచి ప్లాట్ఫాం మీదకు దిగగా ఆ వెనుకే ఉన్న మరో మహిళ కదులుతున్న రైలు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్ సతీశ్... దూరం నుంచే మహిళలను వారించారు. అయినా ఆ మహిళ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించింది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడబోయిన ఆ మహిళను కానిస్టేబుల్ కాపాడారు.
ప్లాట్ ఫాంపై పడబోయింది... హుటాహుటిన స్పందించిన రైల్వే కానిస్టేబుల్ సతీశ్... పట్టాలపైకి జారిపోతున్న మహిళను చేయి పట్టి ప్లాట్ ఫాం పైకి లాగటంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. వెంటనే ఇదే విధంగా ఆమె భర్తను రైల్వే కానిస్టేబుల్ ప్రమాదం నుంచి తప్పించాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తాము స్టేషన్ దాటి పోతుందన్న కంగారు లోనే దిగేందుకు ప్రయత్నించామని చెప్పటం తో మహిళను ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు వారించి వదిలిపెట్టారు. ఇద్దరిని ప్రమాదం నుంచి కాపాడిన రైల్వే కానిస్టేబుల్ సతీశ్ను రైల్వే అధికారులు అభినందించారు.
ఇదీ చదవండి: పీసీసీ ఎంపికతో పాటు తాజా రాజకీయాలపై చర్చ