Garbage Tax: ఏపీలో చెత్త పన్నుతో అందరికీ చిక్కులొచ్చి పడ్డాయి. ఇది ప్రజలకే భారం అనుకుంటే.. ఇప్పుడు ఉద్యోగులకూ ఎసరు తెచ్చింది. పట్టణాల్లో చెత్త పన్ను వసూళ్లకు పారిశుద్ధ్య కార్యదర్శులకు ఉన్నతాధికారులు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. దీని ప్రకారం.. 80 శాతం కంటే తక్కువ పన్నులు వసూలు చేసిన వారిని విధుల నుంచి తప్పించి వారిస్థానంలో కొత్తవారిని నియమిస్తామని విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక కమిషనర్ పి.సింహాచలం మంగళవారం ప్రత్యేక సర్క్యులర్ జారీచేశారు.
municipal commissioner warning to sanitation secretaries: కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. 2021 నవంబర్ నుంచి 2022 జనవరి వరకు పూర్తిస్థాయిలో పన్ను వసూలు కాలేదని, రోజువారీ లక్ష్యాలు పెట్టుకుని ఏప్రిల్ ఆరో తేదీలోగా 80 శాతానికి పైగా రాబట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మొత్తం 13 మంది సెక్రటరీలకు వివరాలు అందజేశారు. పారిశుద్ధ్య కార్యదర్శులు, పర్యావరణ ఇంజినీర్లు పర్యవేక్షించి, నివేదిక ఇవ్వాలన్నారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్వతీపురంలో మొత్తం 11,612 గృహాలు, 1,152 వ్యాపార దుకాణాలున్నాయి. గృహాల నుంచి నెలకు రూ.50, దుకాణ యజమానుల నుంచి రూ.120 చొప్పున వసూలు చేయాలి. సచివాలయ కార్యదర్శులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతున్నా చాలా మంది డబ్బులు కట్టడానికి నిరాకరిస్తున్నారు.
వసూలైతేనే బండి కదిలేది: యూజర్ చార్జీలు వసూలైతేనే చెత్త వాహనాలు కదిలే పరిస్థితి ఉంది. క్లాస్ కార్యక్రమంలో భాగంగా పట్టణానికి 16 చెత్త తరలింపు వాహనాలు ఇచ్చారు. ఒక్కో దానికి నెలకు రూ. 62 వేలు ఖర్చవుతోంది. ఈ లెక్కన రూ.9.92 లక్షలు వాహనాల నిర్వహణకే సరిపోతుంది. ఖర్చులెక్కువ, వసూలు తక్కువగా ఉండడం వల్ల గత నెలలో ఒక వాహనాన్ని తగ్గించారు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం.. యూజర్ ఛార్జీల నుంచే భరించాలనడంతో అధికారులకు తలనొప్పిగా మారింది.
డబ్బులు కట్టలేదని దుకాణం సీజ్: ఆస్తి పన్ను కట్టలేదని పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న ఓ దుకాణాన్ని మంగళవారం సీజ్ చేశారు. బకాయిలతో కలిపి రూ.84 వేలు కట్టాల్సి ఉందని కమిషనర్ పి. సింహాచలం తెలిపారు. ఈక్రమంలో యజమాని, అధికారుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత సగం చెల్లించడంతో దుకాణాన్ని తెరిచారు.
నవంబరు నుంచి జనవరి వరకు ఇలా..(రూ.లలో)
డిమాండ్: 22,76,070
వసూలు: 14,21,620
రావాల్సింది: 8,54,450
ఇదీ చదవండి: పురపాలక కమిషనర్ "చెత్త" ఆదేశాలు.. ఉద్యోగం ఊడిపోద్దట..!