దేశంలోని 80 కోట్ల రైతుల జీవనాధారాన్ని కార్పోరేట్ కంపెనీలకు... భాజపా ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడు నల్ల చట్టాలతో రైతు జీవితాలపై మరణ శాసనం రాస్తోందని ధ్వజమెత్తారు. రెండు నెలలుగా ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా... ఉద్యమం చేస్తూ 20 మంది రైతులు చనిపోయినా... మోదీ ప్రభుత్వం చలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్భవన్ ఘెరావ్ సందర్భంగా పోలీసులు రేవంత్ను అరెస్టు చేసి... నాంపల్లి పీఎస్కు తరలించారు. పోలీసులు విడుదల చేసిన అనంతరం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు.
రైతులకు అండగా నిలిచేందుకే తమ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్భవన్ ఘెరావ్కు పిలుపిచ్చినట్టు రేవంత్ వివరించారు. ప్రధాన మంత్రి మోదీతో చేసుకున్న చీకటి ఒప్పందం మేరకే... సీఎం కేసీఆర్ తమను నిర్బంధిస్తున్నారని విరుచుకుపడ్డారు. భారత్ బంద్కు మద్దతు పలికిన కేసీఆర్... నాలుగు రోజుల్లోనే యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రైతు చట్టాలతో భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ కల్పించిన భరోసాను... కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు భూస్థాపితం చేశాయని ఆరోపించారు. కేసీఆర్, నరేంద్ర మోదీ రైతులకు చేస్తున్న అన్యాయంపై... కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'రాహుల్... అబద్ధాలు ఎప్పుడు మానేస్తారు?'