రాజద్రోహం సహా పలు అభియోగాలపై ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. జైలు నుంచి రఘురామ సొంత వాహనంలోనే తీసుకెళ్లారు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రఘురామను వెంటనే సికింద్రాబాద్లోని సైనిక ఆస్పత్రికి తరలించాలని.. సుప్రీంకోర్టు సోమవారం మధ్యాహ్నమే ఆదేశించింది. అమలు బాధ్యతలను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించగా జాప్యం చేశారని.. ఎంపీ భార్యతో పాటు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సీఎస్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు వారు తెలిపారు. ఆ తరువాత కాసేపటికే సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు సీఎస్ ద్వారా గుంటూరు జిల్లా కలెక్టర్కు అందాయి. కలెక్టర్ ఆ సమాచారాన్ని జైలు అధికారులకు పంపడంతో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు.
సాయంత్రం 6 గంటల 40నిమిషాలకు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో ఏపీ సీఐడీ అధికారులు సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రికి రాత్రి 11 గంటలకు తీసుకువచ్చారు. మిలటరీ నిబంధనల ప్రకారం ఆస్పత్రి ఎదుట ప్రత్యేక అంబులెన్స్ను ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. ఎస్కార్ట్ వాహనాల శ్రేణిని ఆస్పత్రి ఎదుటే నిలిపివేసి ప్రత్యేక అంబులెన్స్ వాహనంలో లోపలికి తీసుకెళ్లారు. ఎస్కార్ట్ వాహనంలో నుంచి దిగిన ఆయన.. దూరం నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం హైకోర్టు న్యాయాధికారి .. రఘురామ కృష్ణమరాజు చేరుకోక ముందే మిలటరీ ఆస్పత్రికి వచ్చారు. రాత్రే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ముగ్గురు సభ్యులతో కూడిన వైద్యబృందం పర్యవేక్షణతో పాటు విచారణ చేపట్టనుంది. వీటిని వీడియో రికార్డు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీడియోను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాలని తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామకృష్ణరాజు మిలటరీ ఆస్పత్రిలోనే ఉండనున్నారు.
ఆయన కూడా ఉన్నారు..
తనను విచారణ పేరుతో దారుణంగా ముసుగు వేసుకుని కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ ముసుగులో సునీల్కుమార్ అనే డీజీ కూడా ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తనను చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: తీరం దాటిన తౌక్టే- గుజరాత్, మహారాష్ట్రలో అల్లకల్లోలం