హైదరాబాద్ నగరంలో 40 ప్రాంతాల్లో ఉన్న ఛార్జింగ్ కేంద్రాలకు తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 138 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించే మూడు ప్రధాన జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) కసరత్తు చేస్తోంది. ఏటా 200 చొప్పున రానున్న మూడేళ్లలో 600 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయనున్నారు.
1,087.45 కిలోమీటర్ల పరిధిలో..
దేశంలోని ప్రధాన నగరాల జాబితాలోని బెంగళూరు, పుణె, విజయవాడల మధ్య ప్రజల రాకపోకలు గణనీయంగా ఉన్న దృష్ట్యా 1,087.45 కిలోమీటర్ల పరిధిలో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాహనదారులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు నిర్ణయించారు. నాగ్పుర్- హైదరాబాద్- బెంగళూరు, ఛత్తీస్గఢ్ సరిహద్దు- వరంగల్- జనగామ- హైదరాబాద్, పుణె- హైదరాబాద్- సూర్యాపేట- విజయవాడ మార్గాల్లో ఛార్జింగ్ కేంద్రాలకు డిమాండు ఉంటుందని అంచనా వేశారు.
కరీంనగర్, వరంగల్లలో మరో 20
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చిన కరీంనగర్, వరంగల్లలోనూ విద్యుత్తు వాహనాలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని టీఎస్రెడ్కో గుర్తించింది. ఒక్కో నగరంలో 10 చొప్పున 20 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై అధికారులు త్వరలో ప్రణాళిక రూపొందించనున్నారు.
రానున్నరోజుల్లో పెరగనున్న గిరాకీ
ప్రస్తుతం రాష్ట్రంలో 5,451 విద్యుత్తు వాహనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్య మరింత పెరుగుతుందని రవాణా రంగ నిపుణుల అంచనా. విద్యుత్తు వాహనాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. తద్వారా ఛార్జింగ్ కేంద్రాలకూ గిరాకీ పెరుగుతుందన్నది అంచనా. ప్రస్తుతం ఉన్న విద్యుత్తు వాహనాల్లో 4,310 మోటారు సైకిళ్లే. వ్యక్తిగత, మోటారు క్యాబులు 812, ఆటోలు, ఈ-రిక్షాలు 197, సరకు రవాణా వాహనాలు 82, బస్సులు 48, ప్రైవేటు సర్వీసు వాహనాలు 2 ఉన్నాయి. ఏటా సగటున నాలుగున్నర నుంచి అయిదు లక్షల వరకు నూతన వాహనాలు రాష్ట్ర రహదారులపైకి వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో వీటిలో ఏటా 3-4 శాతం వరకు విద్యుత్తు వాహనాలుండే అవకాశం ఉందని అంచనా.
తయారీదారులకు, కొనుగోలుదారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు విద్యుత్తు వాహన రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే విద్యుత్తు వాహనాల తయారీ, ఇంధన నిల్వ విధానాన్ని ఆవిష్కరించింది. వాహనాల తయారీదారుల నుంచి కొనుగోలుదారుల వరకు అందరికీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్తు వాహనాలకు గిరాకీ ఉంది. వాహనాల సామర్థ్యాన్ని బట్టి ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
-ఎన్.జానయ్య, ఎండీ, టీఎస్రెడ్కో