హైదరాబాద్లో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ (vaccine testing center) ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్గా మారిన భాగ్యనగరంలో టెస్టింగ్ సెంటర్ అత్యవసరమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ టెస్టింగ్ సెంటర్కు.. ఇక్కడి సంస్థలు శాంపిల్స్ పంపడం ద్వారా 45 రోజుల సమయం వృథా అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేయవచ్చన్నారు. రానున్న 6 నెలల్లో నగరం నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న కేటీఆర్... ఇలాంటి తరుణంలో ప్రతీ బ్యాచ్ని హిమాచల్ప్రదేశ్ కసౌలికి పంపడం ద్వారా ఉత్పత్తి తగ్గుతోందని వివరించారు.
వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని.. టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీనోమ్ వ్యాలీలో అందుకు అవసరమైన భూమిని అందిస్తామని వెల్లడించారు. ఫాస్ట్ట్రాక్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.