75వ స్వాతంత్య్ర వేడుకలను గల్ఫ్లోని తెలుగు సంఘాలు ఘనంగా నిర్వహించాయి. తెలుగు సంఘాల ఐక్య వేదిక-కువైట్ ఆధ్వర్యంలో వర్చవల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 8 తెలుగు సంఘాల భాగస్వామ్యమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కువైట్లోని భారత రాయభారి సిబి జార్జి హాజరయ్యారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రత్యేక అతిథిగా.. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
75వ స్వాతంత్య్ర వేడుకలను గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని.. తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. ఈ కార్యక్రములో భాగస్వాములైన తెలుగు కళాసమితి- బహరైన్, తెలుగు కళా సమితి- ఒమన్, ఆంధ్ర కళావేదిక-ఖతార్, తెలుగు అసోసియేషన్- సౌదీ అరేబియా, తెలుగు కళాస్రవంతి-అబుదాబి, తెలుగు కుటుంబాలు-ఫుజైరియ, తెలుగు తరంగిణి... సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
కష్టకాలంలో ఉన్న సురభి నాటకరంగానికి చేయూతనిచ్చేందుకు.. ప్రతినెల ఒకొక్క తెలుగు సంఘం ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన ఏర్పాటుచేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">