రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జాన్వాడ మీర్జాగూడలో జీవో 111కు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసిన కేసులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. ఎన్జీటీ నోటీసులు జారీ చేయడంతో పాటు సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి కేటీఆర్తో పాటు ఫామ్హౌస్ యజమాని ప్రదీప్రెడ్డి వేర్వేరుగా వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఫామ్హౌస్ నిర్మాణంపై ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
జీవో 111కు విరుద్దగా మంత్రి కేటీఆర్ ఫామ్హౌస్ నిర్మించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన ఎన్జీటీ 2020 జూన్ 5న కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తూ.. పరిశీలించడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి కేటీఆర్, ప్రదీప్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరిలో సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. దీనిపై బుధవారం( ఏప్రిల్ 27న) తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీలో పిటిషన్ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది.
ఎన్జీటీ చట్టం ప్రకారం నిర్మాణం జరిగిన ఆరు నెలల్లో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని... దానికి విరుద్దంగా ఎప్పుడో జరిగిన నిర్మాణాలపై ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడం చెల్లదంది. ఫామ్హౌస్ నిర్మాణంతో కేటీఆర్కు ఎలాంటి సంబంధంలేదంటున్నప్పుడు ఆయనకు నోటీసులు కూడా జారీ చేయకుండా కమిటీని ఏర్పాటు చేయడం సరికాదంది. ఈ పిటిషన్లో అసలైన యజమాని ప్రదీప్రెడ్డిని ప్రతివాదిగా పేర్కొనలేదంది. ఎన్జీటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే పరిధి హైకోర్టుకు లేదన్న రేవంత్రెడ్డి వాదనను తోసిపుచ్చింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించి జోక్యం చేసుకోవచ్చని ఆ పరిధి తమకుందని గుర్తుచేసింది. ఎన్జీటీ, రేవంత్రెడ్డి పిటిషన్ విచారణార్హం కాదంటూ మంత్రి కేటీఆర్, ప్రదీప్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించింది.
ఇదీ చూడండి: