కొవిడ్-19 నేపథ్యంలో వ్యవసాయ రంగం, రైతాంగం కుటుంబాలు కుదేలయ్యాయి. అసలే కష్టాల్లో ఉన్న రైతులకు 'గోరు చుట్టుపై రోకలి పోటు' అన్న చందంగా తాజా వ్యవసాయ బిల్లులు సాగుదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ ఉత్పత్తులు స్వేచ్ఛగా అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం వంటి బిల్లులు నిరసిస్తూ పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో... దేశంలో రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గోధుమ సహా రబీ పంటలపై కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కనీస మద్దతు ధరలు ఇలా...
గోధుమపై కనీస మద్ధతు ధర క్వింటాల్కు అత్యల్పంగా రూ.50 పెంచుతూ.. రేటు రూ.1,975 గా నిర్ణయించింది. కేసరి పప్పుపై అత్యధికంగా రూ.300 పెంచి క్వింటా ధర రూ.5,100, ఆవాలపై రూ.225 పెంచి క్వింటా ధర రూ.4,650, కుసుమలపై రూ.112 పెంచి క్వింటా ధర రూ.5,327 చొప్పున నిర్ణయించింది. ఇక శనగపై క్వింటాకు రూ. 225 పెంచి రూ.5,100 , బార్లీపై రూ. 75 పెంచి రూ.1,600గా కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.
స్పష్టత లేకపోవటంపై ఆందోళన...
కేంద్రం ఎంఎస్పీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నా కూడా ఫలితం లేకుండాపోతోంది. ఈ కొత్త బిల్లుల నేపథ్యంలో పంటలకు కనీస మద్దతు ధరలు ఎత్తేస్తారన్న ఆందోళనలను తోసిపుచ్చుతూ... దిద్దుబాటు చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇక ముందు కూడా కనీస మద్దతు ధరలు- ఎంఎస్పీ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు - ఏపీఎంసీ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి తోమర్ చెప్పుకొచ్చినప్పటికీ అదెలా ఉంటుందో పెద్దగా స్పష్టత లేకపోవడంపై రైతులు, రైతుసంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెంచిన ఎంఎస్పీతో మిగిలేదేమీలేదు...
ఎంఎస్పీ ప్రకారం కొనుగోళ్లు జరుగుతాయని కేంద్రం చెబుతున్నా... అనేక చేదు అనుమానాలు రేకెత్తుతోన్నాయి. ఈ పెరిగిన ధరలు 2020-21 పంట కాలం, 2021-22 మార్కెటింగ్ సీజన్కు వర్తిస్తాయి. ఎంఎస్పీ కార్యక్రమం ఇక ముందు కొనసాగిస్తామని... గత ఆరేళ్లల్లో కనీస మద్దతు ధర కింద రైతులకు రూ.7 లక్షలు చెల్లించిందని కేంద్రం స్పష్టం చేసింది. రుతుపవనాల దోబూచులాట మధ్య సాగే సేద్యం, పెరుగుతున్న పెట్టుబడులు, ఆపై లభించే ఎంఎస్పీతో పోల్చితే తమకు మిగిలేదేమీ లేదని రైతులు ఆరోపించారు.
దేశవ్యాప్తంగా అభ్యంతరాలు...
దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకొచ్చి పోరుబాటు పట్టిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. మరోవైపు పంటల మద్దతు ధరల పెంపు చారిత్రాత్మక నిర్ణయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. రైతు ఆదాయాలు రెట్టింపు దిశగా వ్యవసాయ సంస్కరణల బిల్లులు కోట్ల మంది రైతులకు లబ్ధికలిగిస్తాయని, లక్ష్య సాధనకు దోహదపడతాయని ప్రధాని పేర్కొనటాన్ని రైతులు, రైతుసంఘాలు, నిపుణులు తప్పుపడుతున్నారు.