హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సువర్ణ రెసిడెన్సీలో ఆడుకుంటున్న బాలుడిని విచక్షణారహితంగా దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలలహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. నిందితుడిపై నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదుచేయాలని సైబరాబాద్ సీపీని కోరినట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే..
సువర్ణ రెసిడెన్సీలో నివసిస్తున్న క్రాంతి కుమార్ అనే వ్యాపారి అదే అపార్టుమెంట్లో ఉంటున్న బాలుడు జయంత్ను ఈనెల 8న విపరీతంగా దాడిచేసి గాయపడిచాడని బాలుడి తల్లి వాపోయింది. అనంతరం తనకు ఫోన్ చేసి దూషించాడని తెలిపింది. క్రాంతి కుమార్పై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదుచేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని చెప్పింది. అందువల్లనే బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించామని పేర్కొంది.
క్రాంతి కుమార్పై హత్యయత్నం కేసు నమోదుచేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్, బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు వెల్లడించారు. పిల్లలను హింసించే మనస్తత్వం ఉన్నందున క్రాంతి కుమార్ పిల్లలను శిశువిహార్కు తరలించాలని కోరారు.
ఇవీచూడండి: విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం