కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన సీఎస్... కొవిడ్ వ్యాక్సిన్ సన్నద్ధతపై చర్చించారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎవరికైనా టీకా వికటిస్తే తగు చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలన్న సీఎస్... అన్ని కేంద్రాల వద్ద అదనపు వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆసుపత్రుల సహకారంతో వ్యాక్సిన్ తీసుకునే వారందరూ అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని సోమేశ్ కుమార్ సూచించారు. మొదటి రోజు తక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చి అనుభవాల ఆధారంగా ఆ తర్వాత క్రమంగా పెంచుకుంటూ పోవాలని సీఎస్ తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు