హైదరాబాద్లో రౌడీయిజాన్ని అంతం చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా స్థానిక అమీర్పేట్ చౌరస్తాలోని సత్య థియేటర్ వద్ద భాజపా అభ్యర్థి కేతినేని సరళకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా మందు అందేలా భాజపా కృషి చేస్తుందని... ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు.
నగరంలో తాగునీటి కొరత తీర్చి ఉచిత మంచినీరు పంపిణీ చేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ, మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. వరద సాయం అందని బాధితులకు గ్రేటర్లో అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ మొట్టమొదటిగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: జోరుమీదున్న భాజపా... రంగంలోకి అమిత్ షా