సమయం ముగిశాక కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్పైతో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్నేష్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..!
ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్గూడ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్లో 'అల వైకుంఠపురం' సినిమా ప్రీ రిలీజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డేతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, చిన్నబాబు హాజరయ్యారు. ఈ నెల 2న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె. యగ్నేష్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని లేఖలో పేర్కొన్నాడు.
అయితే కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 11:30 గంటల వరకు కొనసాగింది. గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్ ఇచ్చామని పేర్కొని దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లు గుర్తించారు.
"నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ ఎన్ఏ నవీన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్తో పాటు యగ్నేష్ పై కేసు నమోదు చేశారు"
నిబంధనలు ఉల్లంఘన
- వేడుకలో తొక్కిసలాట జరిగింది.
- వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
- యూసుఫ్ గూడ రహదారులు కిక్కిరిశాయి.. ట్రాఫిక్ స్థంబించింది.
- పోలీసులు వీరిని నియంత్రించకపోవడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.