ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)పై అవగాహన లేని వాళ్లందరూ ముఖ్యమంత్రి రాసిచ్చినా కాగితాలు చూసి మాట్లాడుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఆంధ్రవాళ్లని విమర్శిస్తున్న వారు... రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నది మీ ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నించారు. నిజాయతీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టుల సాధన తన వల్లే జరిగిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏడేళ్లుగా జల దోపిడిని అడ్డుకోలేని వాళ్లు.. హుజురాబాద్ ఉపఎన్నికలన్నాయనే.. వాటిపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫలితంగా ప్రజల దృష్టి మళ్లీంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు నీళ్ల పేరు చెప్పుకొని ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్.. ఆ ప్రజలనే మోసం చేసిన ఘనుడని దుయ్యబట్టారు. పాలమూరు జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు తెరాస నాయకులకు లేదన్నారు.
కృష్ణా జలాలు పెద్ద ఎత్తున వృథా అవుతున్నా.. దాని గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వాల మీద నిందలు వేస్తూ ఇంకెన్ని రోజులు పరిపాలన సాగిస్తారో చెప్పాలన్నారు.
ఇవీచూడండి: Complaint: ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు