సైబర్ నేరాలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ... నేరగాళ్లు ఎప్పటికప్పడు తమ పంథా మార్చుకుంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడున్నారు. అమాయకుల ఖాతాల్లోంచి సొమ్ము లూటీ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో కొత్తరకం మోసం బయట పడింది. ప్రధానంగా ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని... చరవాణులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. మీ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నారు. మీరు చేసుకోనట్లైతే 9298112345 నంబరుకు సంక్షిప్త సందేశం పంపించండి అని మేసేజ్ చేస్తున్నారు. మీ కార్డు బ్లాక్ చేసేందుకు 7679751875 కు వెంటనే ఫోన్ చేయండి అని సందేశాలు పంపుతున్నారు.
లింకు తెరిస్తే... అంతే
సందేశంలో ఉన్న నంబర్లకు ఫోన్ చేస్తే... అంతే నేరగాళ్లు తమ పని మొదలుపెడుతున్నారు. అప్పటికే పూర్తి వివరాలు తెలుసుకొని... బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి నమ్మిస్తారు. మీకో లింకు పంపుతున్నాం.. ఆ లింకు తెరిచి అందులో వివరాలు నమోదు చేస్తే... అరగంటలో మీ ఖాతాలో నగదు జమ అవుతుందని చెబుతారు. ఆ లింక్లో బాధితుడి అంతర్జాల ఆధారిత ఖాతాకు సంబంధించిన UPI ఐడీ ఉంటుంది. దీని ద్వారా బాధితుడి బ్యాంక్ ఖాతాల్లో నగదును తస్కరిస్తారు. బాధితులు తమ ఖాతాల్లో నగదు విత్డ్రా అయిందని తెలుసుకుని మాట్లాడే లోపు ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.
మహిళలు, వృద్ధులే లక్ష్యంగా...
ఆంధ్రాబ్యాంక్లో అంతర్జాల ఆధారిత బ్యాంక్ ఖాతాదారుల వివరాలు సైబర్ నేరస్థులు... పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి డబ్బులిచ్చి సేకరిస్తున్నారు. రోజుకు దాదాపు 200 మంది చరవాణులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పతున్నారు. త్వరగా స్పందిస్తారని... మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా బిహార్, ఝార్ఖండ్కు చెందినవారు ఈ నేరాలు చేస్తున్నారని గుర్తించారు. సంక్షిప్త సందేశాలు చూసిన వెంటనే బ్యాంక్ అధికారులు, సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి: చిరుద్యోగి మంచితనం.. ఉన్నతాధికారి స్వార్థం