మరో పది రోజుల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడాల్సి ఉన్నా..గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాల ఖాళీల పెంపుపై స్పష్టత రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’లో పేర్కొన్న ప్రకారం గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులు కలిపి 36 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఖాళీలను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా..ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ప్రకటనల జారీ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది.
ప్రభుత్వం ప్రకటించిన 36 ఖాళీల్లో గ్రూపు-1 పోస్టులు 31, గ్రూపు-2 పోస్టులు అయిదు మాత్రమే ఉన్నాయి. గ్రూపు-1 పోస్టుల్లో... బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (సివిల్)-7, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్/అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్-2, రీజినల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్-2, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, వైద్యారోగ్య శాఖకు చెందిన 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. గ్రూపు-2 కింద 5 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈరెండు కేటగిరీల్లో పోస్టుల సంఖ్యను పెంచితే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడి, సామాజిక వర్గాల వారీగా ఏపీపీఏస్సీకి ఆయా శాఖల నుంచి వివరాలు త్వరగా వెళితేనే జారీ చేయబోయే నోటిఫికేషన్లో కలిపేందుకు అవకాశం ఉంటుంది. మరో పది రోజుల్లోగా ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది.
లక్షల దరఖాస్తులు ఖాయం
గ్రూపు-2 కేటగిరీలో కేవలం 5 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీచేసి, పరీక్ష నిర్వహించాల్సి రావడం అరుదైన పరిణామం. ఏపీపీఏస్సీ నుంచి నోటిఫికేషన్లు వెలువడితే గ్రూపు-1 ఉద్యోగాలకు లక్ష, గ్రూపు-2 ఉద్యోగాలకు కనీసం రెండు లక్షలకుపైగా దరఖాస్తులు వస్తాయి. ప్రస్తుత నియామక ప్రక్రియలో ఉన్న 169 గ్రూపు-1 పోస్టులకు ప్రకటన జారీ చేస్తే 1.14 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
- ఏపీపీఏస్సీ వద్ద చాలాకాలం నుంచి ఖాళీ చేయాల్సిన భర్తీ పోస్టులు 1,198 ఉన్నాయి. ఇందులో రెవెన్యూకు చెందిన 600 వరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఇవికాకుండా బ్యాక్లాగ్ పోస్టులు 300 వరకు ఉన్నాయి. వీటి భర్తీకి కూడా ఏపీపీఏస్సీ నుంచి ప్రకటనలు వెలువడనున్నాయి.
ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితి మినహాయింపు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. గతంలో జారీ చేసిన పదేళ్ల ఉత్తర్వుల కాలపరిమితి మొన్నటి మే నెలతోనే ముగిసింది.
- ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే... ఓసీ అభ్యర్థులతోనే నింపే విషయమై స్పష్టతివ్వాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపుపైనా ప్రభుత్వం నుంచి ఏపీపీఏస్సీకి సమాచారం వెళ్లాలి.
- క్రీడలు, మాజీ సైనికోద్యోగుల కోటాలో ఉద్యోగాలు భర్తీకాకుండా ఉంటే... ఓసీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తున్నారు. ఇతర రిజర్వేషన్ల కేటగిరీల్లో పోస్టులు మిగిలితే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి, ప్రత్యేక నోటిఫికేషన్స్ ద్వారా భర్తీచేస్తున్నారు.
- ప్రస్తుత జనరల్ కేటగిరీలో వయో పరిమితి పెంపు జీఓ కాలపరిమితి వచ్చేనెలాఖరులోగా ముగియనుంది. దీనిపైనా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
- వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: KISHAN REDDY: యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్రెడ్డి