ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని(AP CM Jagan about swechha program) ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్కిన్లు అందిస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు వీటిని ఇస్తారు. ఆ రాష్ట్ర మంత్రి వనిత, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ'(AP CM Jagan about swechha program) లక్ష్యం. 10 లక్షలమందికి పైగా కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్లు అందిస్తాం. వినియోగించిన న్యాప్కిన్లను డిస్పోజ్ చేసే పద్ధతులపై అవగాహన కల్పించాలి. నోడల్ అధికారి ద్వారా కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తాం. ఏపీలో ఇన్సినరేటర్లు కూడా ఏర్పాటయ్యాయి. చిన్నారుల పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోతోంది. చదువు ఆగడానికి రుతుక్రమం సమయంలో ఇబ్బందులే కారణం. ఇలాంటి పరిస్థితి మారి.. ఇబ్బందులు రాకూడదనే చర్యలు తీసుకుంటున్నాం. శరీరంలో మార్పులు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ప్రతి నెలలో కార్యక్రమం జరిగేలా జిల్లాలో జేసీ పర్యవేక్షించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో ఉచితంగా బ్రాండెడ్ న్యాప్కిన్లు ఇవ్వనున్నాం. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్కిన్లు అందిస్తాం. స్వేచ్ఛ పథకం అమలుకు నోడల్ అధికారిగా మహిళా అధ్యాపకురాలుని నియమిస్తాం.'
-ఏపీ సీఎం జగన్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయిస్తారు. రూ.31.48 కోట్ల వ్యయంతో పీ అండ్ జీ, నైన్ బ్రాండ్లకు చెందిన శానిటరీ న్యాప్కిన్లను ఇవ్వనున్నారు. యునిసెఫ్, పీఅండ్జీ వారి సమన్వయంతో రుతస్రావ సమయంలో పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: errabelli dayakar rao speech in assembly: ఉపాధి హామీ నిధుల వినియోగంలో అగ్రస్థానంలో తెలంగాణ