ఏపీ గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి ఐకాస నాయకుడు పులి చిన్నాను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామంలో తాటాకులతో వేసిన శిబిరం పడిపోవటంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిమెంటు రేకులతో కొత్తది నిర్మించారు. ఐకాస నాయకులు, రైతులు, మహిళలు శిబిరంలో పాల్గొని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు చిన్నాను అదుపులోకి తీసుకున్నారు.
పొలం వివాదంలో దూషించి బెదిరిస్తున్నట్లు అదే గ్రామానికి చెందిన పులి ఏసుకృపయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... చిన్నాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాను శిబిరాన్ని పునర్నిర్మించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందునే కొందరు ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెడుతున్నారని పులి చిన్నా ఆరోపించారు. తన పొలం పక్కనున్న వ్యక్తి కావాలనే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'