Amaravati meeting in Tirupati: అమరావతి అందరిదీ అంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా కదం తొక్కారు రైతులు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. తిరుపతిలో రాజధాని పరిరక్షణ మహోద్యమ సభ నిర్వహించారు. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు, ప్రజలతో సభా ప్రాంగణం.. జనసంద్రమైంది. అమరావతి రైతులకు మద్దతుగా ప్రజలు ఆకుపచ్చ కండువాలు.. మెడలో వేసుకుని సభకు వచ్చారు. జై అమరావతి అంటూ నినదించారు. కళాకారులు ఉద్యమగీతాలు ఆలపించగా.. రైతులు, మహిళలు ఆకుపచ్చ కుండువాలు గాల్లో తిప్పుతూ గొంతుకలిపారు.
Amaravati Farmers Public Meeting: అమరావతిని ఒకసామాజిక వర్గానికి అంటగట్టడాన్ని తిప్పికొడుతూ సభను సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. రాజధానికి భూములిచ్చిన వివిధ వర్గాల రైతులు.. పాదయాత్రలో తమకు ఎదురైన కష్టాలను వివరిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. రాష్ట్రం భవిష్యత్ కోసం వేల ఎకరాల భూములిచ్చిన తమపై ప్రభుత్వం కక్షగట్టిందని మహిళలు వాపోయారు. భవిష్యత్ పోరాటంలో.. తమకు అండగా నిలవాలని.. విజ్ఞప్తిచేశారు.
హాజరైన రాజకీయపక్షాలు.. ప్రభుత్వంపై విమర్శలు
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని అమరావతి మహోద్యమ సభకు హాజరైన వివిధ రాజకీయ పార్టీల నేతలు.. ముక్తకంఠంతో నినదించారు. వైకాపా, సీపీఎం మినహా అన్నిపార్టీల నేతలూ సభకు హాజరై.. రైతుల త్యాగం వృథా కాబోదని భరోసా ఇచ్చారు. ఇది తెలుగుదేశం సభంటూ మంత్రులు చేసిన విమర్శలపై.. నేతలు మండిపడ్డారు.
అమరావతిపై ఎందుకు మాట తప్పారు..? - చంద్రబాబు
chandrababu speech in Meeting: అమరావతి ఏ ఒక్కరిదో కాదని.. ప్రజారాజధాని అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిపై సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'లో పాల్గొన్న బాబు.. ఎన్నికల ముందు ఏం చెప్పారో జగన్ గుర్తు తెచ్చుకోవాలన్నారు. మడమ తిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.
ఎప్పుడైనా మునిగిందా..? - చంద్రబాబు
"అమరావతి ఉద్యమంలో 180 మంది చనిపోయారు. అమరావతి ఉద్యమకారులు 2,500 మందిపై కేసు పెట్టారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టిన ప్రభుత్వం ఇది. అమరావతి రైతులు చేసిన పాపం ఏమిటి ? హైదరాబాద్ అనుభవం ఉందని చెప్పి భూమి తీసుకున్నాం. అమరావతి ఉద్యమానికి అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి. అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు. అమరావతి గట్టి నేల కాదని ప్రచారం చేశారు. మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా..? ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది." - చంద్రబాబు, తెదేపా అధినేత