రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. హైదరాబాద్లోని గణనాయకులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ట్యాంక్బండ్కు క్యూకట్టాయి. హుస్సేన్సాగర్కు వచ్చే క్రమంలో వినాయకుల శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. నగరంలోని వినాయకులే కాకుండా పక్కనున్న సంగారెడ్డి నుంచి కూడా ఓ వినాయకుడు ట్యాంక్బండ్లో నిమజ్జనమయ్యేందుకు వినూత్నంగా తరలివచ్చాడు.
స్కేటింగ్ చేస్తూనే శోభాయాత్ర..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వావివాల గ్రామానికి చెందిన లక్ష్మణ్.. తన ఇంట్లో వినాయకున్ని ప్రతిష్ఠించుకున్నాడు. నవరాత్రులు ఘనంగా పూజించాడు. నిమజ్జనం ట్యాంక్బండ్లోనే చేయాలన్న పట్టుదలతో హైదరాబాద్కు తీసుకొచ్చాడు. అందరిలాగా.. ఆ వినాయకుని శోభాయాత్ర ఆటోలోనో.. కారులోనో.. లారీలోనో.. ట్రాలీలోనో.. బండిపైనో సాగలేదు. వినూత్న రీతిలో ఆ భక్తుడే స్కేటింగ్ చేస్తూ.. ట్యాంక్బండ్కు తరలివచ్చాడు. దాదాపు 40 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేసుకుంటూనే.. తన బుజ్జి గణేశున్ని హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చాడు.
ఐదేళ్లుగా స్కేటింగ్ చేస్తూనే..
విగ్రహాం కదలకుండా ఉండేలా.. తన ముందు భాగంలో ఏర్పాటు చేసుకుని.. తాళ్లతో కట్టున్నాడు. ఈ సరంజామాను ఆకట్టుకునే డెకరేషన్తో అలంకరించుకుని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టిన ఈ స్కేటింగ్ శోభాయాత్ర.. అక్కడక్కడా సేదతీరుతూ.. సాయంత్రానికి ట్యాంక్బండ్ చేరుకుంది. ఇలా గత ఐదేళ్లుగా.. గణేశున్ని స్కేటింగ్ చేస్తూ ట్యాంక్బండ్కు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నట్టు లక్ష్మణ్ చెబుతున్నాడు. తన తండ్రి, గ్రామ సర్పంచ్తో పాటు స్థానికుల ఇస్తున్న ప్రోత్సాహంతోనే ప్రతి ఏటా గణనాథుని తీసుకొని స్కేటింగ్ చేసుకుంటూ వస్తున్నానని తెలిపాడు.
ఇదీ చూడండి:
Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్ మహారుద్ర గణపతి