2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9(సీ) రిటర్నుల దాఖలుకు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉన్న ప్రస్తుత గడువును మరో రెండు నెలలు పెంచి.. డిసెంబర్ 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో మే నెలలో.. 2018-19 జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు కేంద్రం మూడు నెలలు (సెప్టెంబర్ 30 వరకు) గడువు పొడిగించడం గమనార్హం. అయితే గత నెల ఈ గడువును అక్టోబర్ 31గా నిర్ణయించింది.
తాజా గడువు ముగింపు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. మరోసారి గడువు పెంపు అవసరమని వ్యాపార వర్గాల నుంచి భారీగా వినతులు రావడం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) తెలిపింది. లాక్డౌన్, కరోనా నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా ఇంకా పలు ప్రాంతాల్లో సాధారణ వ్యాపార పరిస్థితులు నెలకొనలేదనే కారణాలతో ప్రధానంగా వినతులు అందినట్లు వివరించింది.
ఇదీ చూడండి:ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు