ఇంటర్నెట్ వినియోగంతోపాటు హ్యాకింగ్, సమాచారం దొంగిలించటం, అన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి. అలాంటి నష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ మార్గం ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ బీమా.
ఇటీవల కాలంలో సైబర్ బీమా పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీ బీమా తీసుకోవటం ద్వారా ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ లయబిలిటీకి సంబంధించిన కవరేజీ లభిస్తుంది. సైబర్ హ్యాకింగ్, అటాక్ల విషయంలో కవరేజీ అందుతుంది. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులనూ బీమా సంస్థలు అందిస్తాయి.
రెండు రకాలు..
సైబర్ సెక్యూరిటీ బీమా రెండు రకాలు. ఒకటి వ్యక్తిగతంగా తీసుకునేది కాగా.. ఇంకోటి సంస్థలు తీసుకునేది.
వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఆన్లైన్ యూజర్లకు వర్తిస్తుంది. ఇంటర్నెట్లో డేటా, నగదు చోరీకి గురైనప్పుడు ఇది వర్తిస్తుంది.
సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఐటీ సంస్థలకు వర్తిస్తుంది.
బీమా వర్తించే అంశాలు
గుర్తింపు చోరీ
కంప్యూటర్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించటం, తొలగించటం, మార్చటం, సోషల్ మీడియాలో జరిగే గుర్తింపు చోరీకి ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి థర్డ్పార్టీపై కేసు నమోదు అయినట్లయితే ప్రాసిక్యూషన్కు , రవాణా, డాక్యుమెంట్ల ఫొటో కాపీ ఖర్చులను సైబర్ బీమా ద్వారా పొందొచ్చు.
సైబర్ స్టాకింగ్
అన్లైన్ యూజర్లు సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు, వేధింపుల విషయంలో కూడా థర్డ్ పార్టీపై న్యాయ పోరాటానికి కావాల్సిన ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది.
మాల్వేర్ అటాక్
మాల్వేర్ అంటే డిజిటల్ సేవలకు ఆటంకం కలిగించే ఓ సాఫ్ట్వేర్. ఇది సందేశాలు లేదా ఫైల్ ట్రాన్స్ఫర్, డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ల ద్వారా వస్తుంది. మాల్వేర్ ద్వారా డిజిటల్ సర్వీసెస్కు జరిగిన ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు సైబర్ బీమా ఉపయోగపడుతుంది.
ఐడీ గుర్తింపు చోరీ
అనుమతి లేకుండా కంప్యూటర్లోకి చొరబడి థర్డ్ పార్టీలకు చెల్లింపులు చేయటం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టాన్నికి కూడా సైబర్ బీమాతో ధీమా పొందొచ్చు.
పిషింగ్
అనుమతి లేకుండా యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్రెడిట్ కార్డుల వివరాలు పొందటం సున్నిత సమాచారం యాక్సెస్ కావటం వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి సంబంధించిన కేసులో న్యాయపోరాటానికి కావాల్సిన ఖర్చులను బీమా సంస్థ నుంచి పొందొచ్చు.
ఈ-మెయిల్ స్పూఫింగ్
ఈ-మెయిల్ను ఫోర్జరీ చేయటం లేదా తారుమారు చేయటం ద్వారా మెయిల్ పొందిన వారు నిజమైన వారి నుంచే వచ్చింది అనుకోవటం ఈ-మెయిల్ స్పూఫింగ్. ఇలాంటి మెయిల్స్ వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి థర్డ్ పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్ ఛార్జీలను బీమా సంస్థ చెల్లిస్తుంది.
బీమా వర్తించని అంశాలు..
అంతర్జాతీయంగా, ఉదేశపూర్వకంగా జరిగే దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. బీమా తీసుకున్న వ్యక్తులు మోసపూరిత చర్యలకు పాల్పడకూడదు. పాలసీ కొనుగోలుకు ముందుగా జరిగిన దాడులను గాని, పాలసీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాలను గాని పాలసీ కవర్ చేయదు. సరైన పాస్వర్డ్తో యాంటీ వైరస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోయినా, తగిన రక్షణ చర్యలు తీసుకోని సందర్భాల్లోనూ పాలసీ కవర్ చేయదు.
క్లెయిమ్ ఎలా?
18 ఏళ్లు పైబడిన వ్యక్తులంతా సైబర్ సెక్యూరిటీ బీమా తీసుకోవచ్చు. క్లెయిమ్ కోసం 90 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని రాత పూర్వకంగా అందజేయాలి. నష్టానికి సంబంధించిన ఆధారాలు బీమా సంస్థకు అందించాలి. విచారణ అనంతరం పాలసీ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు ఉంటేనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తుంది బీమా కంపెనీ.
ఫోరెన్సిక్ రిపోర్టు, క్లెయిమ్ ఫారమ్, స్క్రీన్ షాట్లు, నష్టానికి సంబంధించిన వివరాలు క్లెయిమ్ కోసం అందించాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ క్లెయిమ్కు బీమా కంపెనీలు సాధారణంగా 30 రోజుల సమయాన్ని తీసుకుంటాయి.
అర్హత ఎలా?
ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా వచ్చే ప్రమాదాలను సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ను వర్తించుకోవచ్చు. కంపెనీల విషయంలో అయితే లిఖితపూర్వక డేటా ప్రొటెక్షన్ లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ ఉండాల్సి ఉంటుంది. యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్, యాంటీ మాల్వేేర్ సాఫ్ట్వేర్ను తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలి.
ఇవీ చదవండి: