స్టాక్ మార్కెట్లు వరుసగా 8వ సెషన్లో నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 96 పాయింట్ల నష్టంతో 37,463 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 23 పాయింట్ల నష్టానికి 11,279 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఇవీ కారణాలు
ట్రంప్ అన్నట్లుగానే ఈ ఉదయం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలు 10 నుంచి 25 శాతానికి పెంచింది అమెరికా. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం మదుపరుల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
వాణిజ్య చర్చలపై అంచనాలు, దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరడం, పెరిగిన ముడి చమురు ధరలు నేటి నష్టాలకు కారణం.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ నేటి ట్రేడింగ్లో 37,721.98 పాయింట్ల గరిష్ఠం నుంచి 37,370.39 పాయింట్ల కనిష్ఠాల మధ్య కదలాడింది. నిఫ్టీ 11,345.80 పాయింట్ల గరిష్ఠాన్ని.. 11,251.05 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
లాభనష్టాలు
క్యూ4 ఫలితాల ఊతంతో ఎస్బీఐ 2.94 శాతం లాభపడింది. భారతీ ఎయిర్టెల్ 2.09 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.88 శాతం, హెచ్డీఎఫ్సీ 0.54 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.25 శాతం, కోటక్ బ్యాంకు 0.22 శాతం లాభాలు నమోదు చేశాయి.
టాటా స్టీల్ అత్యధికంగా 6.10 శాతం నష్టాన్ని నమోదు చేసింది. జర్మన్ దిగ్గజం థైసెంక్రూప్ సంస్థను టాటా స్టీల్లో విలీనం చేయాలన్న ప్రణాళికను యూరోపియన్ కమిషన్ అడ్డుకుందన్న వార్తలు ఇందుకు కారణం.
హెచ్సీఎల్టెక్ 4.07 శాతం, యస్ బ్యాంకు 3.70 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.44 శాతం, ఓఎన్జీసీ 1.74 శాతం, బజాజ్ 1.63 శాతం నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు ఇలా
వాణిజ్య యుద్ధ భయాలకు వ్యతిరేకంగా ఆసియాలో ఇతర ప్రధాన సూచీలైన చైనా సూచీ అత్యధికంగా 3.10 శాతం, హాంకాంగ్ సూచీ-హాంగ్ సెంగ్ 0.84 శాతం లాభాలను నమోదు చేశాయి. జపాన్ సూచీ-నిక్కీ 0.27 శాతం నష్టపోయింది.
ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ట్రేండింగ్ ప్రారంభించాయి.
రూపాయి, ముడి చమురు
సెషన్ ముగింపు ట్రేడింగ్లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 69.86కు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.38 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.66 డాలర్లుగా నమోదైంది.