దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో భారత్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొంది. అంతకు ముందు త్రైమాసికంలో షావోమీకి అత్యంత సమీపంలోకి వచ్చిన ఈ సంస్థ గత త్రైమాసికంలో దానిని దాటేసింది. 2018 తర్వాత అత్యధిక స్థాయిలో మార్కెట్ వాటాను దక్కించుకొంది. ప్రముఖ పరిశోధన సంస్థ కౌంటర్పాయింట్ ఈ నివేదికను అక్టోబర్ చివర్లో విడుదల చేయనుంది.
భారత మార్కెట్లో పుంజుకోవడం సహా ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని మెరుగు పర్చుకొనే అవకాశం శాంసంగ్కు లభించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో దీని వాటా 22 శాతంగా నిలిచింది. ఇక హువావే వాటా 16 శాతానికి పడిపోయింది. యాపిల్ 12శాతం వాటా దక్కించుకొంది. హువావే మార్కెట్ షేర్ భవిష్యత్తులో మరింత పతనం అవుతుందని అంచనావేస్తున్నారు.
ఇటీవల చోటుచేసుకొన్న అంతర్జాతీయ పరిణామాలు స్మార్ట్ ఫోన్ పరిశ్రమను ఒక్క కుదుపు కుదిపాయి. ముఖ్యంగా గల్వాన్ లోయలో భారత్ - చైనా దళాలు తలపడటం వల్ల ఇక్కడి మార్కెట్లలో చైనా ఫోన్లకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. భారత్లో ఆ ఫోన్ల మార్కెట్ 82 శాతం నుంచి 72 శాతానికి పడిపోయింది. దీనికితోడు చైనా యాప్లపై నిషేధం కూడా ప్రతికూల ప్రభావం చూపింది.