ఎంటర్టైన్మెంట్ వ్యాపారాలను సోనీ పిక్చర్స్లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ విరిమించుకుంది. వ్యూహాత్మక పునరాలోచనలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రిలయన్స్కు మెజారిటీ వాటా ఉన్న వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ను.. జపాన్కు చెందిన సోనీ కార్ప్లో విలీనం చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలోనూ రిలయన్స్ మెజారిటీ వాటాదారుగా అవతరించేది.
అయితే ఇప్పుడు..విలీనానికి బదులు డిజిటల్ కంటెంట్ రూపకల్పనకు పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తుల ద్వారా తెలిసింది. ముఖ్యంగా జియో డిజిటల్ వ్యాపారాలకు డిజిటల్ మీడియా, ఎటర్టైన్మెంట్ విభాగాలు తప్పనిసరిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.
ఓటీటీ సేవల్లో అగ్రగామిగా నిలిచేందుకు పెట్టుబడులు పెట్టడం సహా ఇతర ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకూ రిలయన్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:లండన్లో ఓలా క్యాబ్ సేవలకు బ్రేకులు