గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు దేశంలో 10,000కి పైగా కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్, లాక్డౌన్ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధాలు ఏర్పడటం ఇందుకు కారణమైందని పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్ 248(2) కింద మొత్తం 10,113 కంపెనీలను మూసివేశారు.
ఎలాంటి చట్టపరమైన చర్యల వల్ల కాకుండా.. స్వచ్ఛందంగానే వ్యాపారాలను కంపెనీలు మూశాయనే విషయాన్ని సెక్షన్ 248(2) తెలియజేస్తుంది. అత్యధికంగా దిల్లీలో 2,394 కంపెనీలు మూతపడగా.. ఉత్తరప్రదేశ్ (1,936 కంపెనీలు) ఆ తర్వాతి స్థానంలో ఉంది. తమిళనాడులో 1,322, మహారాష్ట్రలో 1,279, కర్ణాటకలో 836, చండీగఢ్లో 501, రాజస్థాన్లో 479, తెలంగాణలో 404, కేరళలో 307, ఝార్ఖండ్లో 137, మధ్యప్రదేశ్లో 111, బిహార్లో 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు.
2020-21లో వ్యాపారాలను ఆపేసిన నమోదిత కంపెనీల వివరాలను తెలియజేయాల్సిందిగా పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్పై వివరాలను తెలియజేశారు.
ఇదీ చదవండి:ఔషధ రంగంలో అగ్రాసనం.. నవీకరణకు కట్టాలి నడుం