పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు మనీలాండరింగ్ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డీఐఎల్) సహా దాని డైరెక్టర్లు, ప్రమోటర్లు, పీఎంసీ బ్యాంకు అధికారులకు చెందిన ఆస్తులను లెక్కిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియలో రూ.3,830 కోట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. గుర్తించిన ఆస్తులను అక్రమ నగదు చలామణీ నిరోధక చట్టం కింద త్వరలోనే జప్తు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ కేసు..
పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్డీఐఎల్ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్ నుంచి హెచ్డీఐఎల్ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.