దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. మరోసారి డీజిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మధ్యలో గానీ పండుగ సీజన్లో గానీ మారుతీ డీజిల్ సెగ్మెంట్ రీ ఎంట్రీ ఉండొచ్చని సమాచారం.
ఎస్యూవీ, మల్టీ పర్పస్ వాహనాల విభాగంలో వినియోగదారులను ఆకర్షించేందుకు మారుతీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఉద్గార నియమాలు తప్పనిసరి చేస్తూ కేంద్రం స్పష్టం చేసిన తర్వాత మారుతీ డీజిల్ విభాగ వాహనాలకు స్వస్తి చెప్పింది.
తాజాగా కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్ అప్గ్రేడ్ చేసే ప్రక్రియ మారుతీ ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే.. వచ్చే ఏడాది మధ్యలో గానీ పండుగ సీజన్లో గానీ.. ఈ ప్లాంట్ నుంచి బీఎస్-6 డీజిల్ ఇంజిన్ల తయారీ ప్రారంభం కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మారుతీ సుజుకీ మాత్రం దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.
తొలుత ఎర్టీగా, విటారా బ్రెజ్జా డీజిల్ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.