కొవిడ్-19 టీకాల నిల్వ, సరఫరా కోసం అత్యంత శీతల ఉష్ణోగ్రత (-70 డిగ్రీల సెల్సియస్) సదుపాయం ఉండే రిఫ్రిజరేటర్లను జనవరిలో ఆవిష్కరించేందుకు గోద్రేజ్ అప్లయెన్సెస్ సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగే మెడికల్ ఫ్రీజర్లను సంస్థ తయారు చేస్తోంది. వీటి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10,000 యూనిట్ల నుంచి 35,000కు పెంచింది కూడా.
"దేశీయంగా, అంతర్జాతీయంగా అవసరం పడితే -70 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్లను తెచ్చేందుకూ మేం సిద్ధంగా ఉన్నాం. జనవరిలో దీనిని ఆవిష్కరించాక.. అప్పుడు విడుదల చేసేందుకు దరఖాస్తు పెట్టుకుంటామ"ని కంపెనీ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు.
ఫైజర్ కొవిడ్-19 టీకా నిల్వకు -70 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమన్న సంగతి విదితమే. ప్రస్తుతం -70 డిగ్రీ ఫ్రీజర్ టెస్టింగ్ దశలో ఉందని కంపెనీ అసిస్టెంట్ వైస్ప్రెసిడెంట్ జైశంకర్ నటరాజన్ పేర్కొన్నారు. 200-300 లీటర్ల రిఫ్రిజిరేటర్ ధర రూ.7-8 లక్షలు మధ్య ఉండొచ్చని అనుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్, అనుమతులు లభించడం పూర్తయ్యాక ధరపై ఓ అంచనాకు వస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:'కొవాక్స్'తో కలిసి తయారీ: అరబిందో