జులైలో భారత ఎగుమతులు సానుకూల వృద్ధిని సాధించాయి. గత నెలలో 2.25 శాతం పెరిగనట్లు ప్రభుత్వం తాజా గణాంకాల్లో వెల్లడించింది. జులైలో నమోదైన ఎగుమతుల విలువ 26.33 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018 ఇదే సమయంలో ఎగుమతుల విలువ 25.75 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్ఠం వద్ద 13.43 బిలియన్ డాలర్లుగా నమోదైన కారణంగా.. ఎగుమతులు వృద్ధి కనబర్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
గత ఏడాది జులైలో వాణిజ్య లోటు 18.63 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది అత్యల్ప వాణిజ్య లోటు.. మార్చిలో 10.89 బిలియన్ డాలర్లుగా ఉంది.
చమురు, బంగారం సహా దిగుమతుల్లో క్షీణత వాణిజ్య లోటు తగ్గుదలకు కారణమైంది.
జులైలో బంగారం దిగుమతులు 42.2 శాతం తగ్గి.. 1.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురు దిగుమతులు 22.15 శాతం క్షీణించి.. 9.6 బిలియన్లకు చేరింది. ఇదే సమయంలో చమురేతర దిగుమతులు 5.92 శాతం తగ్గి 30.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
గత నెలలో రసాయనాలు, ఐరన్ ఓర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది.
కొన్ని కీలక రంగాలైన రత్నాలు, ఆభరణాలు (-6.82 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (-1.69 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు (-5 శాతం) ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.
ఇదీ చూడండి: కార్డుల వ్యాపారంలో వాటా తగ్గింపు దిశగా ఎస్బీఐ