భారత టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన జియో... గిగాఫైబర్ ప్రకటనతో ఇతర నెట్వర్క్లకు పెద్ద సవాల్ విసిరింది. ఈ పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. గిగాఫైబర్ ధాటికి తేలిపోకుండా ఉండేందుకు భారతీ ఎయిర్టెల్ 'ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్' తీసుకొచ్చింది. దీని ద్వారా డీటీహెచ్, బ్రాడ్బ్యాండ్, టీవీ వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
సంప్రదాయ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు, ఇతర వినియోగదారులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఎక్స్ట్రీమ్ ఫైబర్ను మరింత ప్రభావవంతంగా చేసేందుకు ఐఓటీ సొల్యూషన్స్ అందించేందుకు కసరత్తు చేస్తోంది.
త్వరలో జరగబోయే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)-2019 కార్యక్రమంలో టెలికాం ఆపరేటర్లు.. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీ ఎయిర్టెల్ లైవ్-5జీ నెట్వర్క్పై డెమోను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. దానితో పాటు స్మార్ట్ బిజినెస్, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ వంటివి ప్రదర్శించనుంది.
ఎయిర్టెల్ ప్రదర్శించే 5జీ సాంకేతికతలో లైసెన్స్డ్ అసిస్టెడ్ యాక్సెస్ (ఎల్ఏఏ), డిజిటల్ ఇండియాలో ఏ విధంగా భాగస్వాములు అవుతారనే అంశాలు ఉండనున్నాయి. 'ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ' కింద తీసుకురానున్న స్మార్ట్ హోమ్స్ సొల్యూషన్స్ను అందించేందుకు ఐఓటీ సొల్యూషన్స్పై పనిచేస్తున్నట్లు తెలిపింది. మరింత శక్తిమంతంగా పనిచేసే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అనేది సంస్థ స్మార్ట్ హోమ్స్ సొల్యూషన్లోని భాగం. బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్, టీవీ వంటివి ఒకే దానిలో అందిస్తోంది. స్మార్ట్ హోమ్ కోసం ఐఓటీ సేవలను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ద్వారా తీసుకురానుంది.
5జీ నెట్వర్క్..
ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2020 అర్ధభాగంలో లేక 2021 ప్రారంభంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం నిర్వహించే 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రస్తుతం రిలయన్స్ జియో సహా దాదాపు అన్ని సంస్థలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్పెక్ట్రం కేటాయింపులు జరిగే వరకు, టెలికాం సంస్థలు దేశంలో 5జీ సేవలను ప్రారంభించలేవు.
స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్...
భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్పై పనిచేస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్లో స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ను ప్రారంభించింది. ఇందులో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, నగరవ్యాప్తంగా నిఘా, కాలుష్య తనిఖీ, ట్రాఫిక్ అమలు వ్యవస్థ, వీధి దీపాలు, స్మార్ట్ సిగ్నల్ విధానాలు ఉన్నాయి. ఇందులోని కొన్నింటిని ఐఎంసీ-2019లో ప్రదర్శించనుంది ఎయిర్టెల్. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.
కనెక్టెడ్ వాహనాలు..
నెట్వర్క్కు అనుసంధానమైన వాహనాలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఎయిర్టెల్. భారత్లో మొట్టమొదటి ఇంటర్నెట్ కార్-ఎంజీ హెక్టార్ను తీసుకొచ్చింది. భవిష్యత్తు తరం ద్విచక్రవాహనాలు, కార్లను శక్తిమంతం చేయడానికి ఇతర ఆటోమోటివ్ ఓఈఎంలతో పనిచేస్తోంది.
ఇదీ చూడండి: ట్రాఫిక్ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!