కరోనా వైరస్ను నియంత్రించేందుకు అవసరమైన వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య పరిశోధనా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇదే కోవలో భారత్లో వ్యాక్సిన్ల తయారీకి పేరు గాంచిన సీరం ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా తయారీపై కీలక ప్రకటన చేసింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ఉత్పత్తిని రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. మానవులపై టీకా పరిశీలన పూర్తయితే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించింది.
వ్యాక్సిన్ రూపకల్పన కోసం ప్రపంచవ్యాప్తంగా ఏడు సంస్థలు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాయి. అందులో సీరం ఒకటి.
"కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హిల్తో కలిసి మా బృందం పనిచేస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభిస్తామని అంచనా వేస్తున్నాం. నెలకు 50 లక్షల చొప్పున వచ్చే 6 నెలల్లో వ్యాక్సిన్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాతి కాలంలో నెలకు కోటి వ్యాక్సిన్ల చొప్పున ఉత్పత్తి చేయగలమని భావిస్తున్నాం."
-ఆదర్ పూణావాలా, సీఈఓ, సీరం సంస్థ
వ్యాక్సిన్ పరిశోధన ఫలితాలను వివరించారు ఆదర్. మానవులపై ఫలితాలు సానుకూలంగా వస్తే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో మానవులపై వ్యాక్సిన్ పరిశీలన ప్రారంభం అవుతుందని చెప్పారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ సామర్థ్యం, భాగస్వాముల సహకారంపై విశ్వాసంతో ఈ ప్రాజెక్టుకు నిధులు వెచ్చించినట్లు తెలిపింది సీరం సంస్థ. పుణెలోని ప్లాంట్లో ఈ వైరస్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పింది. ఉత్పత్తిలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ వ్యాక్సిన్కు పేటెంట్ హక్కులను కోరబోమని సంస్థ ప్రకటించింది. తమ ఫార్ములాను ఉపయోగించి ఎవరైనా వ్యాక్సిన్లు తయారుచేసి.. అమ్మవచ్చని స్పష్టం చేసింది.
గతంలో మలేరియా వ్యాక్సిన్ ప్రాజెక్టులోనూ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసింది సీరం సంస్థ.
ఇదీ చూడండి: ఉల్లి సాయంతో లాక్డౌన్లో 1200 కి.మీ జర్నీ!