అంతర్జాతీయ సంస్థల కార్యాలయాల ఏర్పాటుతో దేశంలోని మహా నగరాలతో హైదరాబాద్ పోటీ పడి అభివృద్థి చెందుతోంది. ఇప్పటికే గూగుల్, ఆమెజాన్, మైక్రోసాఫ్ట్, క్వాల్ కాం, ఆక్సెంచర్ వంటి ప్రముఖ సంస్థలు నగరంలో కొలువుదీరాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్రాంగణాన్ని ఇక్కడ నెలకొల్పారు. తాజాగా వన్ ప్లస్ తన మొదటి గ్లోబల్ ఆర్ అండ్ డి సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేసింది. వెయ్యికోట్ల పెట్టుబడితో వన్ ప్లస్ సంస్థ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఈ కేంద్రం ద్వారా కృషి చేయనున్నట్లు సంస్థ సీఈఓ పీట్ లూ తెలిపారు.
సహకారం అందిస్తాం:
ఇప్పటికే స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో సత్తా చాటుతున్న వన్ ప్లస్ తన ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరిన్ని ప్రణాళికలతో ముందుకు వస్తే సంస్థ విస్తరణకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని హామీ ఇచ్చారు.
మరింత విస్తారిస్తాం:
ప్రీమియం స్మార్ట్ విక్రయాల్లో దూసుకుపోతున్న వన్ప్లస్ త్వరలో టీవీరంగంలోకి అడుగుపెట్టబోతోంది. భారతీయ వినియోగదారులకే తొలుత వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్తో ఒప్పందం కుదుర్చుకొని మార్కెట్ను విస్తరిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇవీ చూడండి: "ఆర్ధికమాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్రరాజ్యాలు సమష్టిగా ముందుకెళ్లాలి"